మత్స్యకారులు వేటకు వెళ్లినప్పడు కొన్ని సందర్భాల్లో అరుదైన చేపలు వలలో చిక్కుకుతుంటాయి. అలాంటి వాటిలో కచిడి చేప ఒకటి. గోదావరి జిల్లాల్లో మత్స్యకారుల వలకు చిక్కే ఈ చేప.. కాసుల వర్షం కురిపిస్తుంటుంది. తాజాగా కాకినాడ జిల్లాలో మత్స్యకారుల వలకి కచిడి చేప చిక్కింది. కుంభాభిషేకం రేవులో మత్స్యకారుల వలలో ఈ చేప చిక్కింది. ఈ చేప బరువు 25 కిలోలుగా ఉంది. అయితే వేలంలో ఈ చేప రూ. 3.30 లక్షల ధర పలికింది. అయితే మధ్యవర్తి రూ. 20 వేలు కమిషన్ తీసుకున్నట్టుగా చెబుతున్నారు. దీంతో మత్య్సకారుల చేతికి రూ. 3.10 లక్షలు వచ్చినట్టుగా చెబుతున్నారు.
అత్యంత అరుదుగా లభించే కచిడి చేపలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే ఈ చేపలకు లక్షల్లో డిమాండ్ ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ చేపను సీ గోల్డ్, గోల్డ్ ఫిష్గా కూడా పిలుస్తుంటారు. ఈ చేప ఇండో ఫసిఫిక్, బంగాళాఖాతంలోని లోతు జిల్లాలో మాత్రమే కచిడి చేప జీవిస్తోంది.
ఇక, కచిడి చేపలో కొలాజిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఘన పదార్థాలను ఎక్కువ కాలం పాడవకుండా కాపాడుతుంది. దీనిని ప్రాసెస్ చేయడం ద్వారా వచ్చే జెలాటిన్ను ఆహార ఉత్పత్తులు, అనేక వ్యాధులకు ఔషధ తయారీలో ఉపయోగిస్తారు. శస్త్రచికిత్స అనంతరం కుట్లు వేసేందుకు దారం తయారీకి దీనిని వినియోగిస్తున్నారు. ఇలా.. ఎన్నో అనారోగ్యాలకు మంచి ఔషధంగా ఈ చేప ఉపయోగపడుతుంది.