పూర్వ విద్యార్థుల అరుదైన స్వర్ణోత్సవమిది...

Published : Jan 30, 2017, 10:13 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
పూర్వ విద్యార్థుల అరుదైన  స్వర్ణోత్సవమిది...

సారాంశం

కాకినాడు ఇంజనీరింగ్ కాలేజీ 1966 పట్టభద్రులంతా స్వర్ణోత్సవం జరుపుకున్నారు.  వీరందరూ ఇప్పుడు 70 ఏళ్ళు పైబడిన వారే!

 1966 కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్ స్వర్ణోత్సవాలు దిగ్విజయంగా ముగిశాయి.

 

1946 లో నెలకొల్పబడిన అప్పటి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకినాడ దిన దిన ప్రవర్తమానమై ఇప్పుడు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ – JNTUK గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆ కాలేజ్ లో చదువుకుని 1966 లో ఇంజనీరింగ్ పట్టా సాధించిన పూర్వ విద్యార్థులు తమ స్వర్ణోత్సవాలని JNTU K Alumni Auditorium లో అత్యంత వైభవంగా జరుపుకున్నారు.

 

నిన్నా. మొన్నా అనగా...జనవరి 28 -29, 2017 తేదీలలో జరిగిన ఈ ఉత్సవాలలో తమ జీవితాలలో భారత దేశంలోనూ,అమెరికాలోనూ అత్యున్నత శిఖరాలని అందుకున్న పూర్వ విద్యార్థులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఆ నాటి పట్టభద్రులయిన వీరందరూ ఇప్పుడు 70 ఏళ్ళు పైబడిన వారే!

ఈ ఉత్సవాలకి ప్రధాన అతిథిగా పాల్గొన్న JNTUK  ఉప కులపతి గౌ. వి.ఎస్.ఎస్. కుమార్ గారు ఉత్తేజపూరితమైన తమ సుదీర్ఘ ఉపన్యాసంలో ఆ కాలేజ్ విశిష్టతనీ, ఆ నాటి విద్యార్థుల నిబద్ధతనీ, సాధించిన విజయాలనీ కొనియాడుతూ, ఈ నాటి అవసరాలని విశదీకరించి పూర్వ విద్యార్థుల సహాయాన్ని అర్థించారు. కాకినాడ పట్టణ ప్రముఖులు, ప్రధాన నిర్వాహకులలో ఒకరైన వై. ఎస్.ఎన్. మూర్తి ప్రారంభోపన్యాసం చేయగా రెక్టర్ బి. ప్రభాకర రావు గారు, ప్రిన్సిపాల్ G.V.R. ప్రసాద రాజు గారు,పూర్వ విద్యార్థుల సంఘం కార్యదర్శి ప్రొఫెసర్ పి. సుబ్బారావు గారు ఈ స్వర్ణోత్సవాల ప్రాధాన్యత గురించి సముచిత ప్రసంగాలు చేశారు.

 

ప్రారంభ సభలో మొదటి అంశంగా అలనాటి ఆచార్యులైన ప్రొ. కైలాస రావు గారు. ప్రొ. మురళీధర శర్మ గారు, ప్రొ. టి గోవింద రావు, దివంగత ప్రొ. వి.వి.ఎస్. ప్రసాద్ గారి సతీమణి సరస్వతీ దేవి గారికీ పూర్వ విద్యార్థులు ఘన సత్కారం చేసి గౌరవించడం అందరినీ భావోద్వేగానికి గురిచేసి ఎంతో ఆనందాన్ని కలిగించింది.

 

మొదటి రోజు అంతా సుమారు 60 మంది పూర్వ విద్యార్థులు తమ కాలేజ్ రోజులని గుర్తు చేసుకుంటూ, వ్యక్తిగత విజయాలని విశదీకరిస్తూ తమ కుటుంబాలని పరిచయం చేశారు. వీరిలో యాభై సంవత్సరాల తర్వాత కల్సుకున్న వారే అధిక సంఖ్య కావడంతో ఈ స్వర్ణోత్సవాలలో మరింత ఆత్మీయని, స్నేహ భావన చోటు చేసుకున్నాయి. అలనాటి డిగ్రీ ప్రదానాన్ని అనుకరిస్తూ పూర్వ విద్యార్ధులందరికీ జ్ఞాపిక ప్రదానం ప్రొఫెసర్ సుబ్బారావు గారి చేతుల మీదుగా జరిగింది. డాలస్ నివాసి అయిన డా. శేఖరం కస్తూరి అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కలకాలం నిలబడే Soft Copy Souvenir గా రూపొందించిన అందరి జీవన ప్రయాణ సంకలనం (Journey of life after graduation) విశ్వ విద్యాలయం అధికారులతో సహా అందరినీ ఎంతో ఆకర్షించింది.    

 

అమెరికా నుంచి వచ్చిన దేవరాజు మోహన్, పూర్ణ కుమార్ దాస్, కల్నల్ దేశిరాజు హనుమంత రావు, అల్లాడ జనార్ధన రావు,మునుకుట్ల పార్థ సారధి మొదలైన వారు తమ కవితలనీ, చతురోక్తులనీ, పాటలనీ వినిపించి తమ సహాద్యాయులకి వినోదం కలిగించారు. యనమండ్ర విజయ లక్ష్మి ఆధ్వర్యంలో రమ, శ్రీమతి లక్ష్మి దేశిరాజు నిర్వహించిన ప్రత్యేక మహిళా వేదిక ఆసక్తికరమైన ప్రశ్నలూ- జవాబులతో అందరినీ ఆకట్టుకుంది. ఆయుర్వేద శాస్త్రంలో నిష్ణాతుడైన రాజ బహదూర్ ఆయుర్వేదం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించే తన ఐదు ఏడు సూత్రాల  పథకాన్ని కూలంకషంగా వివరించి సమ వయస్కులైన సహాద్యాయుల ఆసక్తిని  మరింత పెంపొందించారు. 

 

బోోస్టన్ నుంచి వచ్చిన ప్రముఖ పారిశ్రామిక వేత్త సుబ్బు కోటా సౌజన్యంతో సాయత్రం స్థానిక రాయల్ పార్క్ హోటల్ లో జరిగిన గ్రాండ్ బాంక్వెట్ లో అంతర్జాతీయ గాయనీ గాయకులు సుచిత్ర బాలాంత్రపు, లలిత నేమాని, పి. వి.రమణ, వై.ఎస్. రామకృష్ణగాన విభావరి అందరినీ అలరించి మొదటి రోజు వేడుకలకి తలమానికంగా నిలిచింది.

 

ఆ మర్నాడు జనవరి 29 న పూర్వ విద్యార్థుల బృందం అన్నవరం దేవాలయం, ఉప్పాడ బీచ్, అక్కడ చీరల కొనుగోలు, కోరింగ అభయారణ్యంలో పడవలో గోదావరి పాయ అయిన తుల్య భాగా నది సముద్రంలో కలిసే సంగమ దర్శనం మొదలైన ఆసక్తికరమైన కార్యక్రమాలతో అలనాటి తమ స్నేహాన్ని పునరిద్దిరుంచుకుని మరింత పదిలపరుచుకున్నారు.

 

ఈ స్వర్ణోత్సవాలకి యాభై ఏళ్ళనాటి మిత్రుల ప్రస్తుత వివరాలు సేకరించి అందరినీ ఉత్తేజపరిచడంలో ప్రముఖ పాత్ర వహించినకె.వి.వి గోపాల కృష్ణ, బంగారా రాజబహదూర్, ఎవరికీ ఇబ్బంది కలగని విధంగా స్థానిక వసతులన్నీ సమర్థవంతంగా ఏర్పాటు చేసి వెన్నెముకగా నిలిచిన వై.ఎస్.ఎన్. మూర్తి, ఈ అపురూప సమావేశ రూప కల్పన చేసి, ప్రధాన సంధాన కర్తగా వేదికని నిర్వహించిన వంగూరి చిట్టెన్ రాజు (అమెరికా), అవసరమైన సహాయాన్ని అలవోకగా అందించిన మొక్కరాల నరసింహ మూర్తి,పొట్లూరి వెంకట్రావు, ఎన్. ఎస్. రావు, కె. గంగాధర రావు ఈ పూర్వ విద్యార్థుల కలయికకు సూత్రధారులుగా వ్యవహరించారు.

 

ప్రతీ నిమిషం ఆసక్తి కరంగా జరిగిన ఈ స్వర్ణోత్సవాల అఖండ విజయం ఈ తరహా పూర్వ విద్యార్థుల సమావేశాలకి కాకినాడలో ఒక నూతన ప్రమాణం సృష్టించింది అని పుర ప్రముఖులు అభిప్రాయ పడ్డారు.

-రాజు వంగూరి

PREV
click me!

Recommended Stories

బీజేపీచేస్తున్న కుట్రను ఎదుర్కోడానికి రాహుల్ గాంధీని ఆహ్వానించాం | YS Sharmila | Asianet News Telugu
Varudu Kalyani Comments on Pawan Kalyan: డైలాగ్స్ వద్దు చర్యలు తీసుకోండి | Asianet News Telugu