మహానాడులో రెచ్చి పోయిన జేసీ
లోకేష్ ముఖ్యమంత్రి అయితే తప్పేంటని.. జేసీ దివాకర్ రెడ్డి ప్నశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన మహానాడుకు హాజరైన జేసీ రెచ్చిపోయారు. ప్రతిపక్ష నేత జగన్ పై విరుచుకుపడ్డారు. ఏపీకి కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి మండిపడ్డారు.
ప్రధాని అయ్యే అర్హత చంద్రబాబుకి ఉందన్నారు. అసలు చంద్రబాబు ప్రధాని పదవిని ఎందుకు వద్దంటున్నారో తనకు తెలియడం లేదన్నారు. చంద్రబాబు కచ్చితంగా ప్రధానమంత్రి కావాలని కోరారు.
విభజన తర్వాత రాష్ట్రం కోసం చంద్రబాబు ఎంతో కష్టపడ్డారన్నారు. పోలవరంపై అవినీతి జరిగిందంటే కాంగ్రెస్ హయాంలోనే జరిగిందన్నారు. ముడుపులు అందాయంటే జగన్కే ముట్టాయని చెప్పారు. మోదీ ప్రధానిగా ఉన్నంతకాలం ఏపీకి ప్రత్యేక హోదా రాదని చెప్పారు. బీజేపీతో కాపురం వద్దని చంద్రబాబుకు ఎప్పుడో చెప్పానన్నారు. ప్రత్యేక హోదా రాదని నాలుగేళ్ల క్రితమే తెలియజేశానన్నారు. హోదా బదులు ప్యాకేజీ ఇస్తానంటే దానికి చంద్రబాబు బోల్తా పడ్డారని జేసీ చమత్కరించారు.
జగన్ ది అంతా వాళ్ల తాత బుద్దేనని ఆయన పేర్కొన్నారు. తనను వైసీపీలో చేరాల్సిందిగా.. జగన్ ..విజయసాయి రెడ్డితో రాయబారం పంపారన్నారు. తాను టీడీపీ ని వీడి వైసీపీలో చేరనని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల కోసం మోదీ దగ్గర నుంచి రూ.1500కోట్లు తీసుకున్నారని జేసీ ఆరోపించారు.
అప్పట్లో సోనియా గాంధీ ఏం చేశారో.. ఇప్పుడు మోదీ కూడా అలానే చేస్తున్నారని చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీకి తెలుగు ప్రజలు ఎవ్వరూ ఓటు వేయరని చెప్పారు.