జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన జనసేన పోరాట యాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 25 నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో మలివిడత యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆ పార్టీ కార్యవర్గం ప్రకటించింది. అంతకుముందు ఈనెల 23న నెల్లూరు జిల్లాలో పవన్ ఒక్కరోజు పర్యటిస్తారని రాజకీయ వ్యవహారాల కమిటీ తెలిపింది.
హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన జనసేన పోరాట యాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 25 నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో మలివిడత యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆ పార్టీ కార్యవర్గం ప్రకటించింది. అంతకుముందు ఈనెల 23న నెల్లూరు జిల్లాలో పవన్ ఒక్కరోజు పర్యటిస్తారని రాజకీయ వ్యవహారాల కమిటీ తెలిపింది. బారా షహీద్ దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారని ఆ తర్వాత రొట్టెల పండుగ వేడుకలో పాల్గొంటారని తెలిపింది.
మరోవైపు ఈనెల 25 నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో మలివిడత పోరాట యాత్ర ఉంటుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి స్పష్టం చేసింది. ఏలూరు నుంచి యాత్ర ప్రారంభం కానుందని తెలిపింది. జనసేన పోరాట యాత్రకు సంబంధించి ఆయా జిల్లాల సమన్వయ కర్తలు, సంయుక్త సమన్వయ కర్తలు, రాజకీయ వ్యవహారాల కమిటీ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగనున్న పాదయాత్రలో పోలవరం ప్రాజెక్టును పవన్ సందర్శిస్తారని తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు సందర్శన తర్వాత అక్కడ జరుగుతున్న పనులను పరిశీలిస్తారని పార్టీ కార్యాలయ వర్గం తెలిపింది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు, వారికి అందుతున్న న్యాయం, పునరావాసం వంటి అంశాలపై నేరుగా బాధితులతోనే చర్చించనున్నారు. ఆ తర్వాత పోలవరం ముంపు గ్రామాల్లో కూడా పవన్ పర్యటిస్తారని తెలిపింది. పశ్చిమగోదావరి జిల్లా అనంతరం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటన చేరుకుంటుందన్నారు.