నేను నీవద్దకే వస్తున్నా:ప్రేమికుడు ఏం చేశాడంటే

By Nagaraju TFirst Published Sep 21, 2018, 3:50 PM IST
Highlights

వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. ఒకరంటే ఒకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. నిండు నూరేళ్లు కలిసి జీవించాలన్నవారి ఆశలు ఆవిరైపోయాయి. ఏ కష్టమెుచ్చిందో ఏమో తెలియదు కానీ ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియురాలి ఎడబాటును తట్టుకోలేని ఆ ప్రేమికుడు నీవులేని జీవితం నాకెందుకంటూ బలవన్మరణానికి పాల్పడ్డాడు.

కర్నూలు: వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. ఒకరంటే ఒకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. నిండు నూరేళ్లు కలిసి జీవించాలన్నవారి ఆశలు ఆవిరైపోయాయి. ఏ కష్టమెుచ్చిందో ఏమో తెలియదు కానీ ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియురాలి ఎడబాటును తట్టుకోలేని ఆ ప్రేమికుడు నీవులేని జీవితం నాకెందుకంటూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. నేనూ నీవద్దకే వస్తున్నానంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ హృదయ విదారకర ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే కర్నూలుకు చెందిన శివరాం(30) బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే అక్కడ ఓ యువతి ప్రేమలో పడ్డాడు. ఇద్దరు ఒకరంటే ఒకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. అయితే ఇటీవలే శివరాం ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేని శివరాం తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. తనతో జీవితాంతం కలిసి ఉంటుందనుకున్న ప్రియురాలు అర్థాంతరంగా తనువు చాలించడంతో తట్టుకోలేకపోయాడు. 

ప్రియురాలి మరణాన్ని తట్టుకోలేక లోలోన కుమిలిపోయేవాడని అతని స్నేహితులు చెప్తున్నారు. తరచూ తమకు బాధకరమైన సందేశాలు పంపుతుండేవాడని తెలిపారు. అయితే కొడుకు తీవ్ర డిప్రెషన్ లో ఉన్నాడని తెలుసుకున్న తల్లిదండ్రులు బెంగళూరుకు వెళ్లారు. అయితే అప్పటికే శివరాం బెంగళూరు నుంచి కర్నూలు వచ్చాడు. ఇంట్లో శివరాం సోదరుడు ఉండటంతో తమ్ముడిని బయటకు పంపించి గదిలో ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. 

శివరాం ఇంటికి వచ్చాడని తెలుసుకున్న స్నేహితులు వెళ్లి చూడగా తలుపులు వేసి ఉన్నాయి. ఎంతకొట్టినా తలుపు తియ్యకపోవడంతో కిటికీలోంచి చూడగా ఫ్యాన్ కు ఉరివేసుకోవడం గమనించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు స్నేహితులు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడి వద్ద నాలుగు పేజీల సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
 
తాను పిరికితనంతో ఆత్మహత్య చేసుకోవట్లేదని, తన ప్రేయసి దగ్గరకు వెళ్లేందుకే చేసుకున్నానని శివరాం సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. తన కళ్లను దానం చేయాలని కోరాడు. తన ప్రేయసి ఇచ్చిన కొన్ని వస్తువులను తనతోపాటు పూడ్చిపెట్టాలని కోరాడు. పోస్టుమార్టంలో తన ఎడమ చేయిని కట్‌ చేయవద్దని, ఆ చేతిపై ఇద్దరి పేర్లతో వేసుకున్న టాటూను అలానే ఉంచాలని ప్రాధేయపడ్డాడు. 

అంతేకాదు తాను ప్రాణంగా ప్రేమించిన ప్రేయసిని ఉద్దేశించి కొంత సందేశాన్ని రాశాడు శివరాం. నేను కూడా నీ వద్దకే వస్తున్నా.. నీవు లేకుండా ఇక్కడ ఉండలేకపోతున్నా సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. అలాగే తాను ఎందుకు చనిపోతున్నానో తెలిపాడు. తనను క్షమించాలని తల్లిదండ్రులను కోరాడు. అలాగే తన పీఎఫ్‌ అకౌంట్‌లో ఉన్న మొత్తాన్ని తన తల్లిదండ్రులకు ఇవ్వాలని కోరాడు. క్షమించాలని తన స్నేహితులను అందులో కోరాడు.  

click me!