
Janasena party leader Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి అధికార వైఎస్ఆర్సీపీ, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మహిళపై జరుగుతున్న నేరాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇటీవల చిత్తూరు, విశాఖ జిల్లాల్లో మహిళలపై జరుగుతున్న నేరాలను ప్రస్తావిస్తూ సీఎం, హోంమంత్రి, మహిళా కమిషన్ ఎందుకు స్పందించడంలేదని జనసేన అధినేత పవన్ ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఆడ బిడ్డల రక్షణ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి.. తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై అధికార పార్టీ, ఏపీ మహిళా కమిషన్ మౌనం వహించడాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా తప్పుబట్టారు. చిత్తూరు జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యార్థిని దారుణ హత్యపై ముఖ్యమంత్రి గానీ, హోంమంత్రి గానీ, రాష్ట్ర మహిళా కమిషన్ గానీ స్పందించలేదని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. పైగా ఇది అనుమానాస్పద స్థితిలో జరిగిన మరణమని చెప్పడం ద్వారా కేసు తీవ్రతను నీరుగార్చేందుకు పోలీసు శాఖ ప్రయత్నిస్తోందనీ, ఆ శక్తులు అమ్మాయి తల్లిదండ్రుల వేదనను అర్థం చేసుకోవాలని అన్నారు.
అలాగే, విజయనగరం జిల్లా లోతుగెడ్డలో దళిత బాలికపై మైనర్ బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కూడా తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ కరువైందని ఆయన అన్నారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలకు భద్రత లేదన్నది వాస్తవమని పవన్ అన్నారు. ఇలాంటి ఉల్లంఘనదారులను ఉక్కుపాదంతో ఎదుర్కోవాల్సిన పోలీసు శాఖకు అధికార యంత్రాంగం స్వేచ్ఛ ఇవ్వడం లేదని ఆరోపించారు. బాలికల రక్షణకు 'దిశ' పోలీస్ స్టేషన్లు పెద్దగా ఉపయోగపడటం లేదనీ, ఆడపిల్లల రక్షణ విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతోందని మండిపడ్డారు.