నిరుద్యోగులకు అండగా జనసేన... జగన్ ఇబ్బందికి కారణమదే..: నాదెండ్ల మనోహర్

By Arun Kumar PFirst Published Jul 20, 2021, 11:39 AM IST
Highlights

వైసిపి చేతిలో మోసపోయిన నిరుద్యోగ యువతకు జనసేన పార్టీ అండగా వుంటుందని జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. 

విజయవాడ: రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగ యువతను నమ్మించి అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇప్పుడు నయవంచనకు పాల్పడుతోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఇలా మోసపోయిన నిరుద్యోగులకు అండగా నిలుస్తున్న జనసేన నాయకులు, జన సైనికులను గృహ నిర్భంధాల్లో ఉంచడం అప్రజాస్వామికమని నాదెండ్ల అన్నారు. 

''ఈ రోజు(మంగళవారం) చేపట్టిన జిల్లా ఎంప్లాయ్ మెంట్ ఎక్స్ఛేంజీల్లో ఉపాధి అధికారికి వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమానికి జనసేన పిలుపునిస్తే వైసిపి ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డుకుంంటోంది. నిన్న రాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జనసేన నాయకులు, శ్రేణులకు పోలీసులు నోటీసులు ఇచ్చి వినతి పత్రాలు ఇచ్చేందుకు వెళ్లకూడదంటూ ఆంక్షలు విధించారు. అర్థరాత్రి ఇళ్లకు వెళ్ళి నోటీసులు ఇచ్చి గృహ నిర్భందాలు చేయడం, కొన్నిచోట్ల పోలీస్ స్టేషన్లకు తరలించడం చేశారు. ప్రజాస్వామ్యంలో వినతి పత్రాలు ఇవ్వడం పౌరులకు, వారి పక్షాన నిలిచేవారికి ఉన్న హక్కు. దీన్ని అడ్డుకోవడం కచ్చితంగా నియంతృత్వ పోకడే అవుతుంది'' అని నాదెండ్ల అన్నారు. 

read more  నిరుద్యోగ యువతకు అండగా జనసేన... రేపు నిరసనలకు పవన్ పిలుపు

''30 లక్షల మంది నిరుద్యోగ యువత కోసం, పాలకులు ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ ఎంప్లాయ్ మెంట్ ఎక్స్ఛేంజీలకు వెళ్ళి వినతి పత్రాలు ఇస్తామంటే అరెస్టులు చేయడాన్ని ఖండిస్తున్నాం. వైసీపీ ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను నమ్మి మోసపోయిన నిరుద్యోగులకు జనసేన బాసటగా నిలిచి శాంతియుతంగా వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమానికి పిలుపు ఇస్తే ముఖ్యమంత్రి ఇబ్బందిపడుతున్నారు. చేసిన వాగ్ధానాన్ని గుర్తుచేసి అమలు చేయమంటే ఆయనకు ఇబ్బంది కలుగుతోందా?'' అని నిలదీశారు. 

''వైసీపీ నాయకులు భారీ సభలు నిర్వహించి, ఊరేగింపులు చేసి, సన్మాన కార్యక్రమాలు చేసుకొంటే లేని ఇబ్బంది యువత కోసం జనసేన శాంతియుతంగా చేపడితే వచ్చిందా? జనసేన కార్యక్రమాలకు ఇచ్చే నోటీసులు, వర్తించే నిబంధనలు అధికార పార్టీ హంగామాలకు, కార్యక్రమాలకు ఎందుకు వర్తించవు? ప్రభుత్వం ఎంతగా కట్టడి చేసి అణచాలని చూసినా జనసేన పార్టీ నిరుద్యోగులకు న్యాయం జరిగేవరకూ అండగా నిలుస్తుంది'' అని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. 

click me!