ఇసుకే కదా అని నిర్లక్ష్యం చేస్తే.. పీకల మీదకి తెచ్చింది: నాగబాబు

By Siva KodatiFirst Published Nov 3, 2019, 5:31 PM IST
Highlights

ఇసుకే కదా అని నిర్లక్ష్యం చేస్తే.. ప్రభుత్వం గొంతుమీదకు వచ్చిందని ఆయన సెటైర్లు వేశారు. 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని.. అయితే కోటిమందికి పైగా భవన నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని.. వారి విలువను ప్రభుత్వం గుర్తించలేకపోయిందని నాగబాబు ఎద్దేవా చేశారు. 

ఇసుక సమస్య ఈ స్థాయిలో విజృంభిస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు సైతం అనుకుని ఉండదన్నారు జనసేన నేత, సినీనటుడు నాగబాబు. విశాఖలో పవన్ కల్యాణ్ లాంగ్‌మార్చ్ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

ఇసుకే కదా అని నిర్లక్ష్యం చేస్తే.. ప్రభుత్వం గొంతుమీదకు వచ్చిందని ఆయన సెటైర్లు వేశారు. 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని.. అయితే కోటిమందికి పైగా భవన నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని.. వారి విలువను ప్రభుత్వం గుర్తించలేకపోయిందని నాగబాబు ఎద్దేవా చేశారు.

కొత్త ప్రభుత్వానికి ఆరు నెలల నుంచి సంవత్సరం సమయం ఇద్దామని పవన్ అన్నారని అయితే జగన్ సర్కార్‌కు అంత ఓపిక లేదేమోనంటూ దుయ్యబట్టారు. ఆరు నెలల్లోనే తమకు పని కల్పించినందుకు వైసీపీ నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Also Read:ఈ ప్రాంతాన్ని సందర్శించడం చాలా ఆనందంగా ఉంది

ఇసుక సమస్యను పదిరోజుల్లో పరిష్కరించేందుకు జనసేన వద్ద మంచి ప్లాన్ ఉందన్నారు. కర్ణాటకలో పవన్ భద్రత కోసం అక్కడి ప్రభుత్వం 900 మంది పోలీసులను కేటాయిస్తే.. మన ప్రభుత్వం కేవలం 70 మందిని మాత్రమే కేటాయించిందని నాగబాబు విమర్శించారు.

ఎలాగైనా ఈ బహిరంగసభను జరగనివ్వకూడదని ప్రభుత్వం భావిస్తోందన్నారు. భవన నిర్మాణ కార్మికులకు ఇప్పటి వరకు జరిగిన నష్టానికి సంబంధించి పరిహారం చెల్లించాలని నాగబాబు డిమాండ్ చేశారు.

మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఆర్ధిక సాయం చేస్తున్నట్లుగానే భవన నిర్మాణ కార్మికులకు సైతం చెల్లించాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం చర్యల వల్ల ఇప్పటికే 8 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని ఇప్పటికైనా సర్కార్ చర్యలు తీసుకోవాలన్నారు. 

భవన నిర్మాణ కార్మికులకు మద్ధతుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ లాంగ్‌మార్చ్‌లో పాల్గొన్నారు. అంతకు ముందు హైదరాబాద్ నుంచి విశాఖ విమానాశ్రాయానికి చేరుకున్న ఆయనకు జనసేన నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

Also Read:జనసేన లాంగ్ మార్చ్: ఏయూ గేట్ల మూసివేత, విశాఖలో ఉద్రిక్తత

మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రహం నుంచి ప్రారంభమయ్యే లాంగ్ మార్చ్.. రామాటాకీస్, ఆసీలుమెట్ట ప్రాంతాల మీదుగా మహిళా కళాశాల వద్దకు చేరుకుంటుంది. అనంతనం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో పవన్ కల్యాణ్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. 

పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుండి వందలాది మంది జనసేన కార్యకర్తలు ఆదివారం నాడు విశాఖకు చేరుకొన్నారు. ఆంధ్రా యూనివర్శిటీ నుండి మద్దెలపాలెం వైపుకు జనసేన కార్యకర్తలు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే మద్దెలపాలెం వైపుకు వెళ్లేందుకు ఆంధ్రా యూనివర్శిటీ వద్ద ఉన్న గేట్లను పోలీసులు మూసివేశారు.

click me!