బీజేపీకి దగ్గరయ్యానని.. కొందరు నాకు దూరమవుతున్నారు, ఎవరితో వున్నా ప్రజలే ముఖ్యం : పవన్ సంచలనం

By Siva KodatiFirst Published Jan 25, 2023, 6:36 PM IST
Highlights

బీజేపీతో పొత్తుకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి దగ్గరగా వున్నానని, కొందరు తనకు దూరం జరుగుతున్నారని అన్నారు . తాను ఎవరితో వున్నాననేది అనవసరమని.. ప్రజలకు మేలు జరగడమే ముఖ్యమని జనసేనాని స్పష్టం చేశారు. 

తప్పు చేస్తే తననైనా నిలదీయాలని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. బుధవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌పై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. చట్టాలు చేయడం కాదని, ఆచరించే మనసున్న మనిషి కావాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.21,500 కోట్లు పక్కదారి పట్టాయని పవన్ కల్యాణ్ ఆరోపించారు. అవే వుండి వుంటే.. దళితులు ఎంతో అభివృద్ధి చెందేవారని, తమ ప్రభుత్వం వచ్చాక సబ్ ప్లాన్ నిధుల వినియోగంపై పర్యవేక్షణకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. 

ఆత్మకూరు గ్రామ ముఖ ద్వారానికి మహాత్మా జ్యోతబా పూలే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడంపై పవన్ అభ్యంతరం తెలిపారు. జ్యోతిబాపూలేతో వైఎస్‌కు పోలికా అని ఆయన ప్రశ్నించారు. చిన్నప్పటి నుంచి తాను యానాదులు ఇతర అణగారిన వర్గాల బాధలు ప్రత్యక్షంగా చూశానని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తి ఆరాధన మంచిది  కాదన్న ఆయన.. తాను వివక్షకు గురయ్యానని గుర్తుచేశారు. బ్రిటీష్ ఎయిర్‌వేస్‌లో ప్రయాణిస్తున్నప్పుడు తనకు మంచినీళ్లు ఇవ్వడానికి బ్రిటీష్ ఎయిర్‌హెస్టెస్ నిరాకరించిందన్నారు. తమకు గౌరవం ఇవ్వనప్పుడు మా దేశంలో మీ ఎయిర్‌వేస్ నడపొద్దని చెప్పినట్లు పవన్ తెలిపారు. దీంతో పైలెట్ వచ్చి క్షమాపణలు చెప్పారని ఆయన అన్నారు. 

ALso REad: రాష్ట్రంలో రాక్షస పాలన అంతమే వారాహి లక్ష్యం.. విజయవాడలో వారాహి ప్రచార రథానికి ఘన స్వాగతం..

ఇదే సమయంలో పొత్తులపైనా పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో తాను దగ్గరగా వున్నానంటే కొందరు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ప్రధాని మోడీని కలిస్తే తన గురించి ఏం మాట్లాడనని, కేవలం ప్రజా సమస్యల గురించే మాట్లాడతానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. బీజేపీకి నేను దూరమయ్యానని, మీరు నాకు దూరం జరగొద్దని ఆయన సూచించారు. తాను ఎవరితో వున్నాననేది అనవసరమని.. ప్రజలకు మేలు జరగడమే ముఖ్యమని జనసేనాని స్పష్టం చేశారు. 

click me!