మనల్ని పరిపాలించిన బ్రిటన్కు ఒక భారత సంతతి బిడ్డ ప్రధాని అవ్వగలిగాడని.. కానీ ఇక్కడ మాత్రం అలాంటి పరిస్ధితులు లేవన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. మంగళవారం ఈ మేరకు ట్విట్టర్లో ఆయన వాయిస్ మెసేజ్ పెట్టాడు.
ట్విట్టర్లో సొంత వాయిస్తో వీడియో రిలీజ్ చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.మనల్ని పరిపాలించిన బ్రిటన్ కు ఒక భారతీయ సంతతి బిడ్డ ప్రధాని అవ్వగలిగే పరిస్థితులు ఉన్నాయన్నారు. కానీ ఇక్కడ ఇంకా ఫ్యూడలిస్ట్ మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఎందుకు రానివ్వరని పవన్ ప్రశ్నించారు. ఎంతకాలం రానివ్వకుండా ఉంటారన్న ఆయన.. భారతదేశం స్వాతంత్రం సంపాదించుకుని మనం చేసిన అద్భుతం ఏంటని నిలదీశారు. పంచాయతీ ఎన్నికల్లో ఒక అణగారిన వ్యక్తి నామినేషన్ వేద్దామనే పరిస్థితులు లేవని... బ్రిటిష్ వాడు వదిలి వెళ్లిపోయినా ఇంకా ఊడిగం ఎవరికి చేస్తున్నామని నిలదీశారు. నామినేషన్ వేసే అర్హత కూడా లేదని భయపెట్టేస్తుంటే ఎలా ఎదుర్కోవాలని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యూడలిస్టిక్ గోడలు బద్దలు గొట్టక తప్పదని.. అది ఏ రోజూ అని ఎదురు చూస్తున్నానని జనసేనాని చెప్పారు.
ఇకపోతే... గత వారం గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో పర్యటించారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా రోడ్డు విస్తరణ కోసం ప్రభుత్వం ఇళ్లు కూల్చడంతో నిరాశ్రయులైన బాధితులను ఆయన పరామర్శించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. ఎన్కౌంటర్ అన్నా భయపడం... ఇక అరెస్టులంటే తగ్గుతామా? జనసేన సభకు స్థలం ఇచ్చారనే ఇప్పటం గ్రామంపై కక్షగట్టి కూల్చివేతలు మొదలుపెట్టారన్నారు. గాంధీజీ, నెహ్రూ గారు, కలాం గారి విగ్రహాలు కూల్చి... వైఎస్సార్ విగ్రహం మాత్రం ఉంచారు. కూల్చివేతలతో పాలన మొదలుపెట్టిన ప్రభుత్వం కచ్చితంగా కూలుతుంది. రోడ్డు మీద గుంతలు పూడ్చలేరుగానీ... రోడ్లు విస్తరిస్తారట అంటూ ఎద్దేవా చేశారు.
ఇప్పటం ఏమైనా కాకినాడా? రాజమండ్రియా? భారీగా విస్తరణ చేయడానికి..ఇప్పటం ప్రజలకు అండగా జనసేన నిలుస్తుంది. సజ్జల డీ ఫ్యాక్టో సీఎంగా వ్యవహరిస్తున్నారు... జనసేన కార్యకర్తలకు ఏం జరిగినా ఆయనదే బాధ్యత అన్నారు. ఇప్పటం గ్రామంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కాలినడకన తిరుగుతూ ప్రజల ఆవేదన విన్నారు. జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారనే ఇప్పటం గ్రామంపై రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టి కూల్చివేతలు మొదలుపెట్టింది. ఈ గ్రామ ప్రజల కోసం నేను రక్తం చిందించడానికైనా సిద్ధంగా ఉన్నానని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
పోలీసు సోదరులు అడ్డుకొన్నా మౌనంగా చేతులు కట్టుకొని నిరసన వ్యక్తం చేస్తూ నడవాలని శ్రేణులకు సూచించారు. పోలీసుల కష్టాలు తనకు తెలుసు అన్నారు. కొంత దూరం తరవాత నడిచిన తరవాత పోలీసులు ఇప్పటం వెళ్ళేందుకు అనుమతించారు. పోరాట స్ఫూర్తికీ... ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమనే భావన కలిగించే మిలిటరీ జర్కిన్ తో పవన్ కళ్యాణ్ ఇప్పటం బయలుదేరటం విశేషం.