హిందూపురంలో ఫ్లెక్సీ వార్.. వైసీపీ ఫ్లెక్సీ చించివేత.. టీడీపీ, జనసేన కార్యకర్తల అరెస్ట్..

By Sumanth KanukulaFirst Published May 27, 2023, 3:05 PM IST
Highlights

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో అధికార, విపక్షాల మధ్య ఫ్లెక్సీ వార్ కొనసాగుతుంది. 

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో అధికార, విపక్షాల మధ్య ఫ్లెక్సీ వార్ కొనసాగుతుంది. పేదలకు, పెత్తందారులకు జరిగే యుద్ధం అంటూ సీఎం జగన్ చెప్పే మాటలను ప్రధానంగా ప్రస్తావిస్తూ, ప్రతిపక్షాలను విలన్లుగా చిత్రీకరిస్తూ వైసీపీ నేతలు హిందూపురంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలపై టీడీపీ, జనసేన  నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే రహమత్ నగర్‌కు చేరుకుని వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని జనసేన, టీడీపీ శ్రేణులు చించేశాయి.

అయితే అక్కడికి చేరుకున్న వైసీపీ శ్రేణులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అయితే అక్కడికి చేరకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. పరిస్థితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే తమ ఫ్లెక్సీలను చించేశారని వైసీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు  చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. టీడీపీ, జనసేనకు చెందిన 10 మందిని అరెస్ట్ చేశారు. వారిని అనదపు జూనియర్ జడ్జి రాజ్యలక్ష్మి ముందు హాజరుపరిచారు. అయితే వారిని జడ్జి రాజ్యలక్ష్మి బెయిల్ మంజూరు చేశారు. 

అయితే ఈ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ, జనసేన శ్రేణులు.. వైసీపీకి కౌంటర్ ఇవ్వాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే హిందూపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే పోలీసులు ఏకపక్షంగా  వ్యవహరిస్తున్నారని టీడీపీ, జనసేన శ్రేణులు ఆరోపిస్తున్నారు. 
 

click me!