రామ విగ్రహం ధ్వంసం.. మత మౌఢ్యం తలకెక్కిన ఉన్మాదపు చర్య.. పవన్ కల్యాణ్

By AN TeluguFirst Published Dec 30, 2020, 3:02 PM IST
Highlights

అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తుంటే, రామతీర్థలో రాములవారి విగ్రహం ధ్వంసం చేశారంటూ పవన్ కల్యాణ్ మండిపడ్డారు. దేవత విగ్రహాలు, ఆలయ ఆస్తులపై దాడులు పెరగడం బాధాకరం అన్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన రామతీర్థం క్షేత్రంలోని బోధికొండపైనున్న కోదండరాములవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ప్రతి ఒక్కరం ఖండించాలన్నారు. 

అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తుంటే, రామతీర్థలో రాములవారి విగ్రహం ధ్వంసం చేశారంటూ పవన్ కల్యాణ్ మండిపడ్డారు. దేవత విగ్రహాలు, ఆలయ ఆస్తులపై దాడులు పెరగడం బాధాకరం అన్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన రామతీర్థం క్షేత్రంలోని బోధికొండపైనున్న కోదండరాములవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ప్రతి ఒక్కరం ఖండించాలన్నారు. 

స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన విధానం, స్వామి శిరస్సు కనిపించకుండా పోవడం తెలుసుకొంటే చాలా బాధ కలిగింది. మన రాష్ట్రంలో గత యేడాదిన్నర కాలంగా దేవతా విగ్రహాలు, ఆలయ రథాలు ధ్వంసం చేస్తున్నారు, అందుకు పరాకాష్టగా రామతీర్థంలోని ఘటన కనిపిస్తోందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. 

శ్రీరాముని విగ్రహాన్ని పగలగొట్టి శిరస్సు భాగాన్ని తీసుకువెళ్ళడం ఏదో పిచ్చివాళ్ళ చర్య అనుకూకూడదు. మత మౌఢ్యం తలకెక్కిన ఉన్మాదపు చర్య ఇది. పిఠాపురం, కొండ బిట్రగుంట, అంతర్వేది ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి తూతూ మంత్రంగా వ్యవహరించడం వల్లే చారిత్రక ప్రసిద్ధి చెందిన ఆలయంలో దుర్మార్గపు చర్యకు తెగబడ్డారు. 
ఇప్పటి వరకూ అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రథం దగ్ధం వెనక ఉన్నవారిని, ఆ నేరానికి పాల్పడ్డవారినీ పట్టుకోలేదు. దేవత విగ్రహాలు, ఆలయ ఆస్తులపై దాడులను ఏ విధంగా చూడాలి? ఇవి మతి స్థిమితం లేనివారి చర్యలు కాదు. మత స్థిమితం లేనివారి పనులుగా భావించాల్సి వస్తోందన్నారు. 

రామజన్మ భూమి అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాగుతున్న తరుణం ఇది. మన రాష్ట్రంలో మాత్రం రాములవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. హిందూ ఆలయాలపై దాడులు పెరిగిపోతుంటే ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదు. ఆయనకు ఏ మత విశ్వాసం ఉన్నా పరమతాలను గౌరవించాలి. 

రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం.. తలను తీసుకెళ్లిన దుండగులు....

హిందూ మతంపై ఒక పథకం ప్రకారమే దాడులు సాగుతున్నాయి. అన్యమత పండుగను పురస్కరించుకొని ముఖ్యమంత్రికి పవిత్ర తిరుమల క్షేత్రం నుంచి మంత్రులు శుభాకాంక్షలు చెప్పడం దురదృష్టకరం. శ్రీవారి కొండపై రాజకీయాలు మాట్లాడకూడదు, అన్యమత సంబంధ విషయాలు ప్రస్తావించకూడదు అనే నియమాలను కావాలనే విస్మరిస్తున్నారన్నారు. 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గత యేడాదిన్నరగా దేవాలయాలపై దాడులు చేస్తూ దేవత విగ్రహాలను, రథాలను ధ్వంసం చేస్తున్న ఘటనలపై కేంద్ర హోమ్ శాఖ దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వరుస సంఘటనలపై సి.బి.ఐ.తో దర్యాప్తు చేయించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

click me!