జమ్మలమడుగు మున్సిపల్ చైర్ పర్సన్ పీఠాన్ని ఆశించి భంగపడ్డానని ఆరోపిస్తూ 4 వార్డు కౌన్సిలర్ జ్ఞానప్రసూన రాజీనామాకు సిద్దపడ్డారు.
కడప: సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప వైసిపిలో మున్సిపల్ ఎన్నికలు చిచ్చు పెడుతున్నాయి. జమ్మలమడుగు మున్సిపల్ చైర్ పర్సన్ పీఠాన్ని ఆశించి భంగపడ్డానని ఆరోపిస్తూ 4 వార్డు కౌన్సిలర్ జ్ఞానప్రసూన రాజీనామాకు సిద్దపడ్డారు. ఎమ్మెల్యే సుధీర్రెడ్డి తనకు చైర్మన్ పదవి ఇస్తానని ప్రకటించి ఇప్పుడు మాటమార్చారని... ఆయన చేసిన ద్రోహానికి మనస్థాపంతో రాజీనామా చేస్తున్నట్లు జ్ఞానప్రసూన వెల్లడించారు.
మరోవైపు ఇదే కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలో అత్యధిక వార్డులను టీడీపీ కైవసం చేసుకొంది. ఈ మున్సిపాలిటీలో 12 స్థానాల్లో టీడీపీ అభ్యర్ధులు విజయం సాధించారు. వైసీపీకి చెందిన అభ్యర్దులు 11 స్థానాల్లో గెలుపొందారు. ఒక్క చోట జనసేన అభ్యర్ధి నెగ్గారు.
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లను అధికార వైసిపి కైవసం చేసుకోగా సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలోని మైదుకూరు మున్సిపాలిటీలో టీడీపీ ఎక్కువ స్థానాలను గెలుచుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు ఏకపక్షంగా రాగా అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, కడప జిల్లాలోని మైదుకూరు మున్సిపాలిటీల్లో టీడీపీకి అనుకూల ఫలితాలు వచ్చాయి.
read more మైదుకూరు ఉత్కంఠ: జగన్ కు డిఎల్ రవీంద్రారెడ్డి షాక్, ఎత్తుకు పైయెత్తులు
ఇలాంటి పరిస్థితుల్లో జమ్మలమడుగులో కౌన్సిలర్ల అసమ్మతి వైసిపికి తలనొప్పిగా మారింది. ఇప్పటికే 4 వార్డు కౌన్సిలర్ రాజీనామా ప్రకటించగా మరికొందరు కౌన్సిలర్లు కూడా అసమ్మతితో వున్నట్లు తెలుస్తోంది. వారిని సముదాయించేందుకు వైసిపి నాయకత్వం ప్రయత్నిస్తోంది.
రాష్ట్రంలోని మిగిలిన మున్సిపాలిటీల్లో టీడీపీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు. చాలా మున్సిపాలిటీల్లో టీడీపీ సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. కొన్ని చోట్ల టీడీపీకి అసలు ఒక్క వార్డు కూడా దక్కలేదు. ఈ రెండు మున్సిపాలిటీల ఫలితాలు టీడీపీ రాష్ట్ర నాయకత్వంలో చర్చ చేస్తోంది. ఇతర మున్సిపాలిటీలో ఏకపక్షంగా ఎన్నికల ఫలితాలు వచ్చినా ఈ రెండు మున్సిపాలిటీల్లో వచ్చిన ఫలితాలు టీడీపీ నాయకత్వంలో చర్చకు కారణమయ్యాయి. వైసీపీకి ధీటుగా నిలబడ్డ జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో టీడీపీ విజయానికి కారణమయ్యాడనే అభిప్రాయాన్ని టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.