ఆకాశంపై ఉమ్మేస్తే తిరిగి మొఖంపైనే... జగన్ పరిస్థితి ఇలాగే: టిడిపి ఎమ్మెల్యే విమర్శ

By Arun Kumar PFirst Published Mar 17, 2021, 10:51 AM IST
Highlights

 తన రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతి మరకలు లేని చంద్రబాబు నాయుడిని అవినీతిపరుడిగా చిత్రీకరించాలని వైసీపీ పడుతున్న ఆరాటం చూస్తుంటే జాలేస్తోందన్నారు టిడిపి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు. 

అమరావతి:  వైసీపీ ప్రభుత్వ అరాచాకాలకు, కక్ష్యసాధింపు చర్యలకు రోజురోజుకీ హద్దులేకుండా పోతోందని పర్చూరు టిడిపి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడికి సీఐడీ నోటీసులు ఇవ్వటం వైసీపీ కుట్రలోభాగమేనన్నారు. తన రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతి మరకలు లేని చంద్రబాబు నాయుడిని అవినీతిపరుడిగా చిత్రీకరించాలని వైసీపీ పడుతున్న ఆరాటం చూస్తుంటే జాలేస్తోందన్నారు. ఆకాశంపై ఉమ్ము వేస్తే తిరిగి మెఖంపైనే పడుతుందన్న సంగతి వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు.

''సీఎం జగన్మోహరెడ్డి కక్ష్యసాధింపులపై పెట్టిన శ్రద్ద రాష్ట్రాభివృద్దిపై చూపితే రాష్ర్టంలో రెండేళ్లలో కనీసం 2 శాతమన్నా అభివృద్ది జరిగివుండేది. 22 నెలల్లో అక్రమ కేసులు, విధ్వంసాలు తప్ప మీరు చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా? వైసీపీ ప్రభుత్వ వ్యవహారశైలితో అమరావతి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారు. మీరు చేస్తున్న విద్వంసాలకు భయపడి  పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టేందుకు పెట్టుబడిదారులు ముందుకు రావటం లేదు'' అని సాంబశివరావు ఆరోపించారు. 

''రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేసి కేసులు, కక్షలతో సరిపెడుతున్నారు. ప్రగలూ.. ప్రతీకారాలు యువతకు ఉద్యోగాలు, రాష్ట్రానికి అభివృద్ధి సాధించి పెడుతుందా? జగన్ రెడ్డిపై ఉన్న కేసుల దృష్టిని మళ్లించేందుకు నాటకాలు ఆడుతున్నారు. దళితుల భూములను బలవంతంగా లాక్కున్న చరిత్ర వైయస్ కుటుంబానికే దక్కుతుంది. అధికార మదంతో వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదు. అధికారం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారు'' అని హెచ్చరించారు.

read more  సీఐడి నోటీసులపై న్యాయ పోరాటం... హైకోర్టును ఆశ్రయించనున్న చంద్రబాబు

''నీలి మీడియాలో అసత్యాలు రాస్తే ప్రజలు నమ్ముతారనుకుంటే పొరబాటే. 22 నెలలుగా కనబడని అక్రమాలు వైసీపీ కంటికి ఇప్పుడు కనిపించాయంటే కుట్రకోణం కాక మరేముంటుంది? రాజారెడ్డి రాజ్యాంగం అమలుతో అధికారులు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అక్రమ కేసులు చంద్రబాబును ఏమీ చేయలేవు'' అంటూ సీఎం జగన్ ను హెచ్చరించారు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు.
 

click me!