రాజారెడ్డి రాజ్యాంగంలో కొత్తగా జే.ఎమ్.ఎమ్ ట్యాక్సులు...: అచ్చెన్నాయుడు

By Arun Kumar PFirst Published Sep 6, 2021, 10:46 AM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఎవ్వరూ ముందుకురావడం లేదని... ఇందుకు జగన్ సర్కార్ జే.ఎమ్.ఎమ్ ట్యాక్సుల వసూళ్లే కారణమన్నారు ఏపి టిడిపి చీఫ్ అచ్చెన్నాయుడు. 

అమరావతి: దేశంలో ఎక్కడైనా కొబ్బరికాయ కొట్టి పనులు మొదలుపెడితే... ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం జే.ట్యాక్స్ కట్టి పనులు ప్రారంభించాల్సి వస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో జె.ఎమ్.ఎమ్ ట్యాక్సులు దందా నడుస్తోందని... రాష్ట్ర స్థాయిలో జేట్యాక్స్.. జిల్లా స్థాయిలో మినిస్టర్ ట్యాక్స్.. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే ట్యాక్సులు చెల్లిస్తేనే వైసీపీ నేతలు పనులు చేయనిస్తున్నారంటూ అచ్చెన్న ఆరోపించారు. 

''మూడు రకాల ట్యాక్సుల దందాతో రాష్ట్రం అదోగతిపాలవుతోంది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి సన్నిహితుడు జయరామిరెడ్డి బరితెగింపులే ఇందుకు నిదర్శనం. వీరి చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా. రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం పనులు చేసే ముందు వైసీపీ ఎమ్మెల్యేలను కలిసి ముడుపులు చెల్లించాలా? పనులు చేపట్టిన వారిని బెదిరించడం ఎంత సిగ్గుచేటు? మీ తీరుతో రాష్ట్రంలో ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా పనులు చేయడానికి ముందుకు రావడం లేదు'' అని ఆందోళన వ్యక్తం చేశారు. 

read more  బీసీలను ఆదుకోండి, ఆ హక్కులు మత్స్యకార సొసైటీలకే ఇవ్వండి: జగన్‌కు చంద్రబాబు లేఖ

''లిక్కర్, ఇసుక, మైనింగ్, పేకాట ద్వారా వచ్చే ఆదాయం సరిపోక ఇప్పుడు కాంట్రాక్టర్లపై పడ్డారు. రెండేళ్ల కాలంలో వందలాది మంది కాంట్రాక్టర్లు పనులు చేపట్టి మీ దోపిడీకి భయపడి వెళ్లిపోయారు. పనుల్లో బిడ్లు వేసేందుకు కూడా జంకుతున్నారు. ముడుపుల కోసం బెదిరించి వారిని పనులు చేయకుండా తరిమేస్తున్నారు'' అన్నారు. 

''రాష్ట్రంలో రోడ్లు వేయడం మర్చిపోయారు. సరైన బాటలు లేక ప్రజలు నానాఅవస్థలు పడుతున్నారు. జగన్నాద రథ చక్రాలొస్తున్నాయని ప్రజలకు చెప్పి... ఇప్పుడు వాహనాల చక్రాలు ఊడిపోయేలా పాలన చేస్తున్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు సాగనివ్వండి. రోడ్లు సరిగా లేక ప్రజలు వాహనాల నుండి ప్రజలు పడిపోయే ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తున్నారు. మీ తీరు ఇలాగే వుంటే ప్రజలు ఈ రహదారుల గోతుల్లో మిమ్మల్ని, మీపార్టీని తొక్కేస్తారు'' అని అచ్చెన్న హెచ్చరించారు. 

click me!