ఏపీలో కరోనా కట్టడికి... జగన్ సర్కార్ కీలక నిర్ణయం

By Arun Kumar PFirst Published May 24, 2021, 4:18 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మరణాలను తగ్గించేందుకు జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతి గ్రామ పంచాయతీలో కోవిడ్ ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఆయా గ్రామాల్లోని పాఠశాలలు, వసతి గృహాలు, ఇతర ప్రభుత్వ, సామాజిక భవనాల్లో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. 

గ్రామాల్లో ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటు కోసం భవనాలను గుర్తించే బాధ్యతను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. అలాగే ఆ కేంద్రాల నిర్వహణ బాధ్యతను సర్పంచులకు అప్పగించనున్నట్లు తెలిపారు. కరోనా పాజిటివ్ కేసుల ఆధారంగా ఈ ఐసోలేషన్ కేంద్రాల్లో బెడ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్త్రీ పురుషులకు వేర్వేరుగా ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. 

read more  ఆనందయ్య మందు:సీఎంఓ అధికారులతో ఆయుష్ కమిషనర్ భేటీ

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కాస్తంత శాంతించినట్లుగా కనిపిస్తోంది. రెండ్రోజులుగా కేసుల సంఖ్యలో మార్పు వచ్చింది. కర్ఫ్యూతో పాటు ఆంక్షలు కట్టుదిట్టంగా అమలు చేస్తండటంతో అవి సత్పలితాలను ఇస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో పాజిటివటి రేటు కూడా తగ్గినట్లు హెల్త్ సెక్రటరీ అశోక్ సింఘాల్ తెలిపారు. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 18,767 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 15,80,827కి చేరుకుంది. ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 104 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 10,126కి చేరుకుంది.

 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి విజయనగరం 11, అనంతపురం 8, తూర్పుగోదావరి 8, చిత్తూరు 15, గుంటూరు 8, కర్నూలు 8, నెల్లూరు 6, కృష్ణ 8, విశాఖపట్నం 9, శ్రీకాకుళం 7, పశ్చిమ గోదావరి 13,, కడపలో ముగ్గురు చొప్పున మరణించారు.

  ఒక్కరోజు కరోనా నుంచి 20,109 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 13,61,464కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 91,629 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,86,17,387కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,09,237మంది చికిత్స పొందుతున్నారు.

 ఒక్కరోజు అనంతపురం 1846, చిత్తూరు 2323, తూర్పుగోదావరి 2887, గుంటూరు 1749, కడప 883, కృష్ణ 774, కర్నూలు 1166, నెల్లూరు 1045, ప్రకాశం 1162, శ్రీకాకుళం 971, విశాఖపట్నం 1668, విజయనగరం 821, పశ్చిమ గోదావరిలలో 1972 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

click me!