వచ్చే ఎన్నికల్లో ‘దేశం’ గెలుపు అనుమానమేనా

First Published Jan 25, 2017, 3:57 AM IST
Highlights

రవాణాశాఖ కమీషనర్ బాలసుబ్రమణ్యం నిబంధనలు కఠినతరం చేస్తున్నారని చెబుతూ మళ్ళీ తమకు సెగ తగలటం ఖాయమని జోస్యం కూడా చెప్పటం విశేషం.

వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొత్త విషయం చెప్పారు. ఐదేళ్లకోసారి ఎన్నికలు జరగటం ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రమాదమట. అధికారంలోకి వచ్చిన మొదటి రెండేళ్లూ సన్మానాలకే  సరిపోతుందన్నారు. మూడో సంవత్సరం దాటిన తర్వాత నిర్ణయాలు తీసుకోవాలంటే ఎన్నికల భయమట.  అదే ఐదేళ్లకోసారి ఎన్నికలు జరగకుండా చర్యలు తీసుకుంటే నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయవచ్చనే గొప్ప సంగతిని ప్రత్తిపాటి కొత్తగా తెలుసుకున్నారు.

 

రవాణాశాఖ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయబట్టే ఆటో, జీపు, ట్యాక్సీ డ్రైవర్లందరూ వ్యతిరేకమవుతారని మంత్రి అభిప్రాయపడ్డారు. 2004 ఎన్నికల్లో తన ఓటమికి కారణం కూడా అదేనన్నారు. ప్రస్తుత రవాణాశాఖ కమీషనర్ బాలసుబ్రమణ్యం నిబంధనలు కఠినతరం చేస్తున్నారని చెబుతూ మళ్ళీ తమకు సెగ తగలటం ఖాయమని జోస్యం కూడా చెప్పటం విశేషం. అంటే వచ్చే ఎన్నికల్లో తమ భవిష్యత్తు ఏమిటో ప్రత్తిపాటి ముందే ఊహిస్తున్నారన్న విషయం అర్ధమవుతోంది. మరి నిప్పు చంద్రబాబేమో జీవితాంతం తానే ముఖ్యమంత్రిగా ఉండాలనుకోవటం సాధ్యం కాదన్న మాట.

 

ఇంతకీ, ఐదేళ్లకోసారి ఎన్నికలు జరగటం ప్రజాస్వామ్యానికే ప్రమాదమన్న సంగతి ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రత్తిపాటికి ఎందుకు గుర్తు రాలేదో? మొదటి రెండేళ్లూ సన్మనాలకే సరిపోతోందని చెబుతున్న మంత్రి ఏం ఘనకార్యాలు చేసారని సన్మానాలు చేయించుకున్నారు? రుణమాఫీల అమలును అడ్డదిడ్డంగా చేసి రైతులు, డ్వాక్రా సంఘాలను ముప్పుతిప్పలు పెడుతున్నదే తమ ఘనతగా మంత్రి భావిస్తున్నారేమో.

 

రవాణా శాఖ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయటంతోనే తమకు సెగ తగిలిందని చెప్పారు. నిబంధనలు ఉన్నదే అమలు చేయటానికి కదా? అయినా నిప్పు చంద్రబాబు ఏమనుకుంటే అదే నిబంధనలుగా చెలామణి అవుతున్నపుడు మళ్ళీ ప్రత్యేక నిబంధనలేమున్నాయి. ప్రస్తుత కమీషనర్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తున్నారు కాబట్టి మళ్లీ సెగ తగలటం ఖాయమని ప్రత్తిపాటి జోస్యం వచ్చే ఎన్నికల్లో నిజమవుతుందేమో?

click me!