రానున్న ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం తరపున వైసిపి తరపున జ్యోతుల చంటిబాబే అభ్యర్ధా? క్షేత్రస్దాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. జగ్గంపేటలో పోయిన ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధిగా జ్యోతుల నెహ్రూ గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే. నెహ్రూపై టిడిపి అభ్యర్ధిగా చంటిబాబు ఓడిపోయారు. నియోజకవర్గంలో బలమైన అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్నప్పటికీ గడచిన రెండు ఎన్నికల్లోనూ చంటిబాబు ఓడిపోయారు.
ఎప్పుడైతే నెహ్రూ టిడిపిలోకి ఫిరాయించారో చంద్రబాబు చంటిబాబును పక్కన పెట్టేశారు. దాంతో అప్పటి నుండి చంటిబాబుకు ఇబ్బందులు మొదలయ్యాయి. అందుకనే కొద్ది రోజుల క్రితమే టిడిపికి రాజీనామా చేశారు. దాంతో వైసిపి నేతలు ఇదే విషయాన్ని వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి చెప్పారు. బలమైన సామాజికవర్గానికి చెందిన నేత కావటంతో జగన్ కూడా సానుకూలంగా స్పందించారు. అందుకనే మంగళవారం గుంటూరు జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్ సమక్షంలో చంటిబాబు వైసిపి కండువా కప్పుకున్నారు. బహుశ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జ్యోతుల నెహ్రూ-జ్యోతుల చంటిబాబు మధ్యే పోటీ ఉండొచ్చు.