రానున్న ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అభ్యర్ధుల జాబితా సిద్దమైందా? రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అందించిన నివేదిక ప్రకారం అభ్యర్ధుల ఎంపికలో జగన్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారా? పార్టీ వర్గాలు అవుననే సమాధానాలు చెబుతున్నాయ్.
నియోజకవర్గాల్లో చేయాల్సిన మార్పులు, చేర్పుల జాబితా పరిశీలనకు వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వద్దకు చేరిందట. 175 నియోజకవర్గాల్లోని పార్టీ పరిస్ధితిపై అంచనా వేసేందుకు జగన్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పికె) తో కాంట్రాక్టు కుదుర్చుకున్న విషయం తెలిసిందే కదా? పికె కూడా దాదాపు ఆరుమాసాలుగా క్షేత్రస్ధాయిలో సర్వేల పేరుతో విస్తృతంగా తిరుగుతున్నారు. అవసరం వచ్చినపుడల్లా జగన్ తో కలిసి సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
అయితే, ఇప్పటికే రెండు విడతలుగా తన సర్వేను పూర్తి చేసిన పికె ప్రాధమికంగా ఓ నివేదికను తయారుచేసి జగన్ కు అందచేశారట. దాని ప్రకారం రాష్ట్రంలోని అన్నీ నియోజవకర్గాల్లోని సామాజిక వర్గాల బలాబలాలపై వివరాలున్నాయట. అంతేకాకుండా ఎంఎల్ఏలతో పాటు సమన్వయకర్తల పనితీరును కూడా వివరించారట. బాగా పనిచేస్తున్న వారు, పనిచేయనివారు అంటూ రెండు రకాల వివరాలు అందచేశారట.
అంతేకాకుండా సమన్వయకర్తలు సక్రమంగా పనిచేయక పోవటానికి కారణాలను కూడా వివరించారట. తక్షణమే సమన్వయకర్తలను తొలగించి కొత్తవారిని నియమించాల్సిన నియోజకవర్గాల జాబితాను కూడా అందచేసారట. దాని ప్రకారమే జగన్ మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు సమాచారం. సమన్వయకర్తలుగా పనిచేస్తున్న నియోజకవర్గాల్లో ఎవరిని పోటీ చేయిస్తే బాగుంటుంది అనే విషయాన్ని కూడా జగన్ కు సూచించారట.
పికె నివేదిక ప్రకారం దాదాపు 70 నియోజకవర్గాల్లో అభ్యర్ధులపై జగన్ ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చారట. కర్నూలు జిల్లా పత్తికొండలో మరణించిన చెరుకులపాడు నారాయణరెడ్డి భార్య శ్రీదేవీరెడ్డి, కుప్పంలో చంద్రమౌళి అభ్యర్ధిత్వాల ప్రకటన కూడా ఇందులో భాగమే అని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా అభ్యర్ధుల ఎంపిక దాదాపు అయిపోయిందని పార్టీ నేతలు చెబుతున్నారు.