అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలపై మావోయిస్టుల దాడి పిరికిచర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోయిస్టులు హతమార్చడానికి నిఘా వైఫల్యమే కారణమని ఆరోపించారు.
విజయవాడ: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలపై మావోయిస్టుల దాడి పిరికిచర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోయిస్టులు హతమార్చడానికి నిఘా వైఫల్యమే కారణమని ఆరోపించారు. పోలీసులను ప్రోటోకాల్ వ్యవస్థకే వినియోగిస్తున్నారే తప్ప ప్రజాప్రతినిధుల కోసం ప్రభుత్వం వినియోగించడం లేదని మండిపడ్డారు.
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. అధికార పార్టీ నాయకుల అక్రమాలకు కాపలాగా పోలీసులను వినియోగిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కళ్లు తెరవాలన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రలతల విషయంలో దృష్టి సారించాలని సూచించారు.
రాజకీయ అవసరాల కోసం ఇంటెలిజెన్స్ విభాగాన్ని వాడుకోవటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కన్నా విమర్శించారు. తెలంగాణ ఎన్నికల కోసం ఏపీ ఇంటిలిజెన్స్ పోలీసులను ముఖ్యమంత్రి చంద్రబాబు వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. పోలీసులకు వారి విధులు వారు సక్రమంగా నిర్వహించుకునే వాతావరణం కల్పించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.