బాంచన్ దొరా అనేలా... వారిని కట్టుబానిసలు చేయాలన్నదే జగన్ కుట్ర: కొల్లు రవీంద్ర

Arun Kumar P   | Asianet News
Published : Jun 03, 2021, 12:47 PM IST
బాంచన్ దొరా అనేలా... వారిని కట్టుబానిసలు చేయాలన్నదే జగన్ కుట్ర: కొల్లు రవీంద్ర

సారాంశం

జగన్ ప్రభుత్వంలో బీసీల సంక్షేమం కేవలం కాగితాలు, అంకెలకే పరిమితం అయ్యిందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. 

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలను కట్టు బానిసలుగా మార్చాలని చూస్తున్నాడని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు కొల్లు రవీంద్ర ఆరోపించారు. బాంచన్ దొరా అని వైసీపీ నేతలు, వాలంటీర్ల చుట్టూ బీసీలంతా తిరిగేలా చేస్తున్నాడని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలో బీసీల సంక్షేమం కేవలం కాగితాలు, అంకెలకే పరిమితం అయ్యిందని రవీంద్ర ఆరోపించారు. 

''మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి హాయాంలో ఆదరణ కింద చేతి, కుల వృత్తుల వారికి 90శాతం సబ్సిడీపై పరికరాలు, యంత్రాలు అందించారు. విదేశాలకు వెళ్లి చదువుకునే బీసీ యువతకు రూ.15లక్షలవరకు అందించారు. స్టడీ సర్కిళ్లు, కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి బీసీ నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ అందించారు. మత్స్యకారులకు 75శాతం సబ్సిడీపై వలలు, పడవలు, మరబోట్లు, మోపెడ్లు అందించారు. బీసీ భవన్లు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి చంద్రబాబు ఒక్కో నియోజకవర్గానికి రూ.50లక్షలు కేటాయించారు. 2018-19లో బీసీల సంక్షేమానికి రూ.16,226కోట్లు ఖర్చు పెట్టారు'' అని రవీంద్ర తెలిపారు. 

''జగన్ అధికారంలోకి వచ్చాక బీసీలను విడదీసి పాలిస్తున్నాడు. వారు ఐక్యంగా ఉంటే తన ఆటలు సాగవని భయపడుతున్నాడు. బీసీ నాయకత్వాన్ని అణిచేసి ఎల్లకాలం కిందిస్థాయిలోనే ఉండేలా చేస్తేన్నాడు. ఇప్పటికే జగన్ ఏర్పాటుచేసిన 56 బీసీ కార్పొరేషన్లు అడ్రస్ లేనివిగా మిగిలిపోయాయి'' అని తెలిపారు.

read more  పీఎం మోదీకే టైముంది... మీకు లేదా శకుని మామా..: జగన్ పై లోకేష్ ఫైర్

''చంద్రబాబు నాయుడు ప్రతి బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్ కు ఏటా బడ్జెట్లో నిధులు కేటాయిస్తే ఈ ముఖ్యమంత్రి బీసీ నిధులను దారి మళ్లిస్తున్నాడు. నాయీ బ్రాహ్మణులు, రజకులు, దర్జీలు రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉంటే ముఖ్యమంత్రి కేవలం వేలమందికే అరకొర సాయం చేస్తున్నాడు'' అని ఆరోపించారు. 

''స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న రిజర్వేషన్లను 34శాతం నుంచి 24శాతానికి తగ్గించింది జగన్మోహన్  రెడ్డే. దానివల్ల బీసీలు రాష్ట్రంలో 16,800 స్థానిక సంస్థల పదవులను కోల్పోయారు. టిడిపి హయాంలో టీటీడీ ఛైర్మన్, ఏపీఐఐసీ ఛైర్మన్ వంటి కీలక నామినేటెడ్ పదవులు బీసీలకే దక్కాయి. నామినేటెడ్ పదవులు, యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్ల నియామకంలో జగన్ కు బీసీలు గుర్తురాలేదా?'' అని రవీంద్ర నిలదీశారు. 

'' అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు సహా నాపై తప్పుడు కేసులుపెట్టారు. అవసరమైతే బీసీలు పస్తులుంటారు గానీ, ఆత్మాభిమానం చంపుకోరనే వాస్తవాన్ని జగన్ తెలుసుకోవాలి'' అని రవీంద్ర పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu