ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. తల్లిదండ్రులు, బంధువుల సాయం

By sivanagaprasad kodatiFirst Published Sep 28, 2018, 9:23 AM IST
Highlights

తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది.. వివాహేతర సంబంధాన్ని వద్దని చెప్పి మందలించాల్సిన తల్లిదండ్రులు, బంధువులు కూడా వివాహితకు మద్ధతుగా నిలవడం గమనార్హం

తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది.. వివాహేతర సంబంధాన్ని వద్దని చెప్పి మందలించాల్సిన తల్లిదండ్రులు, బంధువులు కూడా వివాహితకు మద్ధతుగా నిలవడం గమనార్హం.

కడప జిల్లా సీకే దిన్నె మండలం ఏఎల్ కాలనీకి చెందిన రేఖారాణి అలియాస్ శోభారాణితో చిత్తూరు జిల్లా నక్కలపల్లె తాండాకు చెందిన రవీంద్రనాయక్‌తో కొన్నేళ్ల కిందట వివాహమైంది. రవీంద్ర ఇల్లరికం వచ్చి... అత్తగారింట్లో ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో రేఖకు అదే గ్రామానికి చెందిన హరినాయక్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది తెలుసుకున్న రవీంద్రనాయక్ తన భార్యను పలుమార్లు మందలించాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు.. దీంతో ఇక్కడుంటే భార్య పరిస్థితిలో మార్పు రాదని గ్రహించి మదనపల్లెలో కాపురం పెడదామని భార్యను అడిగాడు. దీనికి ఆమె వ్యతిరేకించింది.

తప్పని చెప్పాల్సిన అత్తమామలు కూడా భార్యకే మద్దతు పలికారు. భర్త ఉంటే తన వివాహేతర సంబంధానికి అడ్డు తగులుతాడని భావించిన రేఖ అతని హత్యకు కుట్రపన్నింది. దీనికి ప్రియుడు హరినాయక్, తల్లిదండ్రులు, బంధువుల సహకారం కోరింది.

పథకం ప్రకారం ఈ నెల 24వ తేదీ రాత్రి రవీంద్రనాయక్‌ను అతని ఇంటి ముందు వీరందరూ కలిసి కర్రలతో తలపై కొట్టడంతో బలమైన గాయాలయ్యాయి. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోకి తీసుకెళ్లి చీరతో ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా... కర్రలతో కొట్టినట్లు తేలింది. దీంతో రేఖారాణి, ఆమె ప్రియుడు హరినాయక్ సహా మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. 

click me!