చంద్రబాబు అరెస్టుతో త‌ట్టుకోలేని బాధ‌.. ఈ 53 రోజులు క్షణం ఒక యుగంలా గడిచింది : నారా భువ‌నేశ్వ‌రి

By Mahesh RajamoniFirst Published Nov 1, 2023, 1:37 AM IST
Highlights

Nara Bhuvaneshwari: రాజమహేంద్రవరం జైలు నుంచి తెలుగు దేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం విడుదలయ్యారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు విడుదల సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు జైలు వద్దకు రావ‌డంతో కాసేపు  కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 
 

Chandrababu Naidu-Bhuvaneshwari: రాజమహేంద్రవరం జైలు నుంచి తెలుగు దేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం విడుదలయ్యారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు విడుదల సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు జైలు వద్దకు రావ‌డంతో  కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చంద్ర‌బాబు జైలు నుంచి విడుద‌ల కావ‌డంపై ఆయ‌న భార్య నారా భువ‌నేశ్వ‌రి స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు. చంద్ర‌బాబు అరెస్టు స‌మ‌యంలో తాను త‌ట్టుకోలేనంత బాధ‌ను అనుభ‌వించిన‌ట్టు తెలిపారు.

చంద్ర‌బాబు అరెస్టు స‌మ‌యంలో త‌ట్టుకోలేని బాధ‌ను అనుభ‌వించాన‌నీ, క్ష‌ణం ఒక యుగంలా గ‌డిచింద‌ని నారా భువ‌నేశ్వ‌రి పేర్కొన్నారు. ఎక్స్ పోస్టులో ఆమె చంద్ర‌బాబు విడుద‌ల‌పై స్పందిస్తూ.. "చంద్రబాబు గారి అరెస్టుతో ఈ 53 రోజుల కాలం ఎంతో వేదన... తట్టుకోలేనంత బాధతో క్షణం  ఒక యుగంలా గడిచింది. అయితే ఈ కష్ట సమయంలో తెలుగు జాతి నుంచి వచ్చిన మద్దతు మాకు ఎంతో ఊరటనిచ్చింది. సత్యం బలం ఎంతో చూపించింది. ఎప్పుడూ బయటకు రాని మహిళలు సైతం, కక్ష సాధింపు రాజకీయాలపై పోరాటంలో, రోడ్డెక్కి చేసిన నిరసనలు, వారు చూపిన తెగువ, మాకు మరింత స్ఫూర్తినిచ్చాయి. నిజం గెలవాలి అనే పోరాటంలో మద్దతుగా నిలిచిన ప్రతి సోదరుడికి, ప్రతి మహిళకు, ప్రతి పౌరుడికి శిరసు వంచి కృతజ్ఞతలు  చెపుతున్నాన‌ని" పేర్కొన్నారు.

అలాగే, ఈ పోరాట, క‌ష్ట స‌మ‌యంలో త‌మ‌కు అండగా నిలిచిన వారికి కృత‌జ్ఙ‌త‌లు తెలిపారు. త‌మ‌పై చూపిన ప్ర‌జ‌ల ప్రేమ‌ను ఎప్ప‌టికీ మ‌ర్చిపోన‌ని నారా భువ‌నేశ్వ‌రి అన్నారు. "నా భర్త అరెస్టుతో 53 రోజులుగా ఇక్కడే బస చేసిన నన్ను మీ ఇంటి బిడ్డలా చూసుకున్న రాజమహేంద్రవరం ప్రజల ఆదరణ, ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను. ఆ దేవుడి దయతో ప్రజలకు, రాష్ట్రానికి మంచి జరగాలి అని కోరుకుంటూ.... మీ భువ‌నేశ్వ‌రి" అని చంద్ర‌బాబు స‌తీమ‌ణి ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. కాగా, టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలయ్యారు. ఈ క్ర‌మంలోనే అక్క‌డికి భారీగా ఆయ‌న మ‌ద్ద‌తుదారులు, టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్దఎత్తున త‌ర‌లివ‌చ్చారు.

నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్, నందమూరి బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, కంభంపాటి రామ్మోహన్ రావు, ఏలూరి సాంబశివరావు, టీడీ జనార్దన్ సహా పలువురు టీడీపీ నేతలు జైలు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. 52 రోజులు జైలు జీవితం గడిపిన చంద్రబాబును చూసేందుకు తెలంగాణ సహా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ మద్దతుదారులు పెద్ద సంఖ్య‌లో వచ్చారు. జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ టీడీపీ కార్యకర్తలు, అభిమానులు వాటిని దాటుకుని జైలు వైపు దూసుకువెళ్లి పోలీసులను పక్కకు నెట్టారు. దీంతో జైలు ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం కనిపించింది.

click me!