విశాఖ శారదా పీఠానికి వెండి మెట్లు బహూకరించిన హైదరాబాద్ దాత (వీడియో)

By Arun Kumar PFirst Published Jul 21, 2021, 9:27 AM IST
Highlights

విశాఖపట్నంలో శారదా పీఠంలో వెలిసిన రాజశ్యామల అమ్మవారికి ఓ భక్తుడు వెండి మెట్లను బహూకరించారు. మంగళవారం ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి గర్భాలయ మెట్లకు తొడిగారు. 

విశాఖపట్నంలోని శారదాపీఠంలో వెలిసిన రాజశ్యామల అమ్మవారికి హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త సురేష్ కుమార్ రెడ్డి వెండి మెట్లను బహూకరించారు. శారదాపీఠ ఆధిష్టాన దేవత అయిన రాజశ్యామల అమ్మవారిపై భక్తితో  28 కిలోల వెండితో మెట్లు చేయించి ఆలయానికి అందించాడు. వీటిని మంగళవారం ఉదయం అమ్మవారి గర్భాలయంలోకి వెళ్లే మెట్లకు తొడిగారు. 

హైదరాబాద్ కు చెందిన సురేష్ రెడ్డి కుటుంబానికి రాజశ్యామల అమ్మవారిపై అమితమైన భక్తి. వివిధ వ్యాపారాలు నిర్వహించే ఆయన తనకు లాభాలు వస్తే రాజశ్యామల అమ్మవారి ఆలయానికి వెండి మెట్లు బహూకరిస్తానని గతంలో మొక్కుకున్నారు. అమ్మవారి అనుగ్రహంతో వ్యాపారం లాభించడంతో తన మొక్కును తీర్చుకున్నారు. మొత్తం 28.045 కిలోల వెండితో మూడు మెట్లను ఆయన తయారు చేయించి అమ్మవారికి సమర్పించారు. 

వీడియో

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి సురేష్ రెడ్డి కుటుంబానికి తీర్థప్రసాదాలు అందించారు.  సురేష్ కుమార్ రెడ్డి కుటుంబానికి రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు ఆకాంక్షించారు. 

ఇక మంగళవారం తొలి ఏకాదశి సందర్భంగా అమ్మవారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఈ పర్వదినం సందర్భంగా భక్తులు కూడా అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. తొలి ఏకాదశి సందర్భంగా రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. 

click me!