Vijayanagaram Suicide:వివాహేతర సంబంధం.. ముగ్గురు పిల్లల తల్లి ఆత్మహత్య

By Arun Kumar PFirst Published Jan 23, 2022, 2:10 PM IST
Highlights

కట్టుకున్న వాడు కుటుంబాన్ని వదిలేసి మరో మహిళతో జీవితాన్ని పంచుకోవడం తట్టుకోలేకపోయిన మహిళ ముగ్గురు బిడ్డలను అనాధలు చేస్తూ ఆత్మహత్య చేసుకుంది. 

విజయనగరం: భార్యాపిల్లల ఆలనా పాలన మరిచి కేవలం తన శారీరక సుఖాన్ని చూసుకున్నాడో వ్యక్తి. భార్య, ముగ్గురు పిల్లలతో జీవితం ఆనందంగా సాగుతుండగా భర్త జీవితంలోకి మరో మహిళ ప్రవేశించడాన్ని ఆ గిరిజన మహిళ తట్టుకోలేేకపోయింది. తనను కాదని మరో మహిళకు భర్త దగ్గరవడంతో జీవితంపైనే విరక్తి  పుట్టి మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే... బొబ్బిలి మండలం గోపాలరాయుడిపేట పంచాయితీ అక్కెనవలస గ్రామానికి చెందిన డొంబిదొరతో పదిహేనేళ్ల క్రితం లక్ష్మికి వివాహమైంది. వీరికి భాస్కరరావు, కిషోర్ తో పాటు అనిత సంతానం. ఇలా భార్యాపిల్లలతో జీవితం ఆనందంగా సాగుతుండగా డొంబిదొర బుద్ది గడ్డితిన్నట్లుంది. మరో మహిళతో అతడు వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు. దీంతో లక్ష్మీ తన ముగ్గురు పిల్లలతో కలిసి భర్తకు దూరంగా వుంటోంది. 

ఇలా ముగ్గురు బిడ్డలను తానే పోషించుకుంటూ పదేళ్ళుగా భర్తకు దూరంగా వుంటోంది. భర్త కూడా తన ప్రియురాలి వద్దే వుంటూ మరో ఇద్దరు బిడ్డలకు తండ్రయ్యాడు. భర్తకు దూరంగా జీవిస్తున్న లక్ష్మికి జీవితంపై విరక్తి కలిగిందో ఏమో తెలీదు గానీ ఇప్పటికే తండ్రిప్రేమకు దూరమైన బిడ్డలను తల్లి ప్రేమకు కూడా దూరం  చేసింది. 

ఎవరూలేని సమయంలో ఇంట్లోనే ఉరేసుకుని లక్ష్మి ఆత్మహత్య  చేసుకుంది. తల్లి మృతదేహాన్ని చూసిన చిన్నారులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇరుగుపొరుగు వారు సమాచారం అందించగా పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.  మ‌ృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. అనతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

భర్త మరో మహిళకు దగ్గరవడంతోనే లక్ష్మి ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కెనవలస గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికే తండ్రి ప్రేమకు దూరమయిన చిన్నారులు తల్లి మృతదేహం వద్ద రోదించడం... చూసినవారికే కన్నీరు తెప్పిస్తోంది. 

ఇదిలావుంటే ఇటీవల చిత్తూరు జిల్లాలో దారుణం వెలుగుచూసింది. కట్టుకున్న భార్యే భర్తను అతి కిరాతకంగా చంపింది. ఇలా భర్తను హతమార్చడమే కాదు తలతో సహా పోలీసులకు లొంగిపోయింది. రక్తం బట్టలతో క్యారీ బ్యాగులో తలను తీసుకెళ్తున్న నిందితురాలిని చూసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

రేణిగుంటలోని పోలీస్ లైన్ లో రవిచంద్రన్ తన కుటుంబంతో నివాసం ఉండేవాడు. ఈ దంపతులకు 20 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే  హటాత్తుగా ఏమయ్యిందో తెలీదుగానీ భార్య చేతిలో రవిచంద్రన్ అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు.  

గత గురువారం భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే ఆగ్రహానికి లోనైన రవిచంద్రన్ భార్య కత్తితో భర్తను చంపింది. భర్త చనిపోయిన తర్వాత తలను మొండెం నుండి వేరు చేసింది. భర్త తలను క్యారీ బ్యాగులో తన వెంట తీసుకొని  పోలీసులకు లొంగిపోయింది.  భర్తను హత్య చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

(ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదు. మీకు ఎటువంటి కౌన్సిలింగ్ సహాయం కావాలన్నా ఐకాల్ (9152987821), ఆసరా (09820466726) వంటి సంస్థలను సంప్రదించండి)

click me!