ఏపీలో టెన్త్ రిజల్స్ట్‌కి విధి విధానాలు: ప్రభుత్వానికి హైపవర్ కమిటీ నివేదిక

By narsimha lodeFirst Published Jul 15, 2021, 11:43 AM IST
Highlights


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్ పబ్లిక్ పరీక్ష ఫలితాలను ప్రకటించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మార్కుల కేటాయింపు కోసం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ కసరత్తు చేస్తోంది. 


అమరావతి:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్ పబ్లిక్ పరీక్ష ఫలితాలను ప్రకటించేందుకు  మార్కుల విధానాన్ని హైపవర్ కమిటీ ఖరారు చేసింది.  హై పవర్ కమిటీ తన నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి అందించనుంది. బుధవారం నాడు సమావేశమైన హైపర్ కమిటీ మార్కుల కేటాయింపుపై విధి విధానాలను ఖరారు చేయనుంది.

ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో విద్యార్థులకు వారి ఫార్మేటివ్, సమ్మేటివ్‌ పరీక్షల్లోని అన్ని సబ్జెక్టుల్లో సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇంతకు ముందు ఆయా సబ్జెక్టుల్లో ఎక్కువ శాతం మార్కులు వచ్చిన(బెస్ట్‌ 3) సబ్జెక్టుల యావరేజ్‌ను పరిగణనలోకి తీసుకుని గ్రేడ్లు ఇవ్వడంపై కమిటీ దృష్టి పెట్టింది.

 అయితే బెస్ట్‌ 3 ప్రకారం కాకుండా అన్ని సబ్జెక్టుల మార్కుల యావరేజ్‌ను పరిగణనలోకి తీసుకోవడం వల్ల అందరికీ మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో ఆ ప్రకారం ఫలితాలివ్వాలని కమిటీ చర్చించింది. ఈ విధానంలోనే 2020–21, 2019–20 విద్యా సంవత్సరాల విద్యార్థులకు గ్రేడ్లు ప్రకటించనున్నారు. 

2020–21 విద్యాసంవత్సరానికి సంబంధించిన విద్యార్థులకు ఫార్మేటివ్‌–1, ఫార్మేటివ్‌–2 మార్కులను తీసుకుని గ్రేడ్లు ప్రకటిస్తారు. ఎఫ్‌ఏ(ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌) పరీక్షలకు సంబంధించి లిఖిత పూర్వక పరీక్షలు, ఇతర పరీక్షలను విభజిస్తారు. ఎఫ్‌ఏ–1లోని లిఖిత పరీక్షకు సంబంధించిన 20 మార్కులను 70 శాతానికి పెంచుతారు.

ఇతర 3 రకాల పరీక్షలకు సంబంధించిన 30 మార్కులను 30 శాతంగా పరిగణిస్తారు.2019–20 విద్యాసంవత్సరానికి సంబంధించిన విద్యార్థులకూ గ్రేడ్లపై కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆ విద్యాసంవత్సరంలో విద్యార్థులు ఫార్మేటివ్‌ అసెస్‌మెంటు(ఎఫ్‌ఏ) పరీక్షలు 3, సమ్మేటివ్‌ అసెస్‌మెంటు (ఎస్‌ఏ) పరీక్ష ఒకటి రాశారు.ఫార్మేటివ్‌ 1, 2, 3ల మార్కులను 50గా తీసుకుంటారు. సమ్మేటివ్‌ పరీక్షలు 100 మార్కులకు నిర్వహించినందున వాటిని యావరేజ్‌ చేసి 50గా తీసుకుంటారు. ఈ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులను రెండింటినీ కలిపి 100 శాతానికి యావరేజ్‌ చేసి గ్రేడ్లు ఇవ్వనున్నారు. 
 

click me!