ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో చుక్కెదురు.. సీఎస్ పై వేసిన కోర్టు ధిక్కార పిటిషన్ కొట్టివేత..

Published : Nov 30, 2022, 07:59 AM ISTUpdated : Dec 01, 2022, 05:01 PM IST
ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో చుక్కెదురు.. సీఎస్ పై వేసిన కోర్టు ధిక్కార పిటిషన్ కొట్టివేత..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ సీఎస్ సమీర్ శర్మ మీద ఐసీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వేసిన కోర్టు ధిక్కారకేసును హైకోర్టు కొట్టివేసింది.


అమరావతి : ఆంధ్రప్రదేశ్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో చుక్కెదరయ్యింది. ఆయన సీఎస్ సమీర్ శర్మ మీద వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. సస్పెన్షన్ అయిన కాలానికి తనకు జీతభత్యాలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ ప్రభుత్వం దానిని ఉల్లంఘించిందని.. తనకు జీతం చెల్లించడం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీద వెంకటేశ్వరరావు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీన్ని హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. 

దీనిమీద కోర్టు వివరణ ఇస్తూ.. ప్రస్తుతానికి ఈ వ్యవహారం ఇంకా తుది దశకు చేరుకోలేదు. అందువల్ల సీఎస్ సమీర్ శర్మ చర్యలను ఉద్దేశపూర్వక ఉల్లంఘనగా కోర్టు పరిగణించడం సాధ్యం కాదు.. అని తేల్చి చెప్పింది. అయితే, తరువాతి కాలంలో కూడా సిఎస్ సమీర్ శర్మ చర్యలు ఇలాగే ఉంటే అవి ఉద్దేశపూర్వక ఉల్లంఘన కిందికి వస్తాయని... ఇలా వెంకటేశ్వరరావు కనక భావిస్తే దానికి తగిన పిటిషన్ దాఖలు చేయవచ్చని.. ఆ పిటిషన్ దాఖలు చేయడానికి ఈ తీర్పు అడ్డుగా ఉండదని, అడ్డు కాదని చెప్పింది.

ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులల ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్ మీద జస్టిస్ సోమయాజులు ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. ఏబీ వెంకటేశ్వరరావు తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. ఆయన వాదిస్తూ పిటిషనర్ సస్పెన్షన్ ను హైకోర్టు కొట్టివేసిందన్నారు. జీతభత్యాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కూడా ఏబీవీ మీదున్న సస్పెన్షన్ ను ఎత్తివేసింది అని అన్నారు. అయినప్పటికీ, సస్పెన్షన్ కాలానికి ప్రభుత్వం జీతభత్యాలు చెల్లించడంలేదన్నారు. ఇది కోర్టు ఆదేశాల ఉల్లంఘన కిందికే వస్తుందని చెప్పారు. 

 జనసేన అధినేత పవన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మంత్రి జోగి ర‌మేష్ ఫైర్

న్యాయవాది వి. మహేశ్వరరెడ్డి  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ తరఫున వాదించారు. ఆయన ఈ వాదనలను తోసిపుచ్చారు. నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు వ్యవహారంలో వెంకటేశ్వరరావుపై కేసు నమోదయ్యిందన్నారు. దీని మీద విచారణ చివరి దశలో ఉందని తెలిపారు. కేసు పూర్వాపరాలు ఆధారంగా సుప్రీం కోర్టు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టి వేయలేదని అన్నారు. సస్పెన్షన్ రెండేళ్లకు మించి ఉండరాదన్న నిబంధనను మాత్రమే  అనుసరించిందని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును సర్వీసులోకి తీసుకుందన్నారు. దీన్ని సాకుగా తీసుకుని జీతభత్యాల అన్నీ చెల్లించాలని ఓ హక్కుగా కోరడం సరికాదని అన్నారు. అంతేకాదు, అవినీతి కేసులో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి విచారణ ఎదుర్కొంటున్నప్పుడు.. అతనికి పూర్తిస్థాయి జీతభత్యాలు చెల్లించాలా, వద్దా అనేది ప్రభుత్వ విచక్షణ అని వి. మహేశ్వరరెడ్డి చెప్పారు.

వెంకటేశ్వరరావుపై విచారణ ముగిసి, నిర్ణయం వెలువడిన తర్వాత, సస్పెన్షన్ సమర్థనీయం కాదు అని ప్రభుత్వం భావిస్తేనే.. అప్పుడు దానికి తగిన ఉత్తర్వులు జారీ చేస్తుందని అన్నారు. కాబట్టి సీఎస్ సమీర్ శర్మ చర్యలు ఏ మాత్రం ఉద్దేశపూర్వక ఉల్లంఘన కిందికి రావని గుర్తించాలని వాదించారు. కాగా, ధర్మాసనం మహేశ్వర్ రెడ్డి వాదనలతో ఏకీభవించింది. ధర్మాసనం మాట్లాడుతూ సస్పెన్షన్ ‘ఎంతమాత్రం సమర్థనీయం కాదు’ అన్న మాటలకు చాలా విలువ ఉంది అని అన్నది.

ప్రభుత్వం, సుప్రీంకోర్టు, ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను ‘ఎంతమాత్రం సమర్థనీయం కాదు’ అని తేల్చలేదు అని, అతనిమీద ఉన్న ఆరోపణల నుంచి విముక్తిని  ప్రసాదించ లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఏబీ వెంకటేశ్వరరావుపై విచారణ చివరి దశలో ఉందని, దీన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు తెలిపారని, చివరి నిర్ణయం ఇంకా తీసుకోలేదని ఈ సందర్భంగా గుర్తు చేసింది. సీనియర్ ఐపీఎస్ వెంకటేశ్వరరావు పూర్తి జీతభత్యాలు అందుకోవడానికి అర్హులా, కాదా అనే విషయాన్ని ఈ దశలో తేల్చడం, ముఖ్యంగా ఈ కోర్టు ధిక్కార వ్యాజ్యంలో తేల్చడం సాధ్యం కాదు అని హైకోర్టు తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

Palla Srinivas Rao Speech: అక్కడ దౌర్జన్యం చేస్తూ డబ్బులు వసూళ్లు | Asianet News Telugu
Vishnu Kumar Raju Speech: వీటిపై ఇంత తక్కువ డబ్బు కేటాయించడం నేనెప్పుడూచూడలేదు | Asianet News Telugu