విశాఖపట్నంలోని గీతం యూనిర్శిటీ కట్టడాల తొలగింపు విషయంలో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు గీతం యూనివర్శిటీ కూల్చివేతలపై స్టేటస్ కో ఆదేశాలను హైకోర్టు జారీ చేసింది.
అమరావతి: విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయం కట్టడాల కూల్చివేతలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. గీతం కూల్చివేతల విషయంలో యధాతథ స్థితిని (స్టేటస్ కోను) పాటించాలని కోర్టు ఆదేశాలు జారీ జేసింది. దీంతో గీతం యూనివర్శిటీ కట్టడాల తొలగింపు ఆగిపోనుంది.
కట్టడాల తొలగింపుపై గీతం విశ్వవిద్యాలయం ప్రతినిధులు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని పరిశీలించిన న్యాయమూర్తి స్టేటస్ కో ఆదేశాలు జారీ చేశారు. సోమవారం వరకు యధాతథ స్థితిని కొనసాగించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. తమకు నోటీసులు ఇవ్వకుండా కట్టడాలని తొలగిస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు.
ఇదిలావుంటే, శనివారం ఉదయం నుంచి గీతం విశ్వవిద్యాలయం కట్టడాలను కొన్నింటిని రెవెన్యూ అధికారులు తొలగించారు. విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారాన్ని తొలగించారు. గీతం యూనివర్శిటీ 40కి పైగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకుందని రెవెన్యూ శాఖ అధికారులు చెబుతున్నారు.
గీతం యూనివర్శిటీ ఆక్రమించుకున్న భూములను స్వాధీనం చేసుకుంటామని అధికారులు చెప్పారు. స్వాధీనం చేసుకునే ప్రక్రియను కూడా వారు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గీతం విశ్వవిద్యాలయం కోర్టును ఆశ్రయించింది.