Heavy rains: భారీ వర్షాలు.. తిరుమలలో విరిగిపడిన కొండచరియలు.. రేణిగుంటలో విమాన సర్వీసులకు అంతరాయం..

By team teluguFirst Published Nov 18, 2021, 4:51 PM IST
Highlights

చిత్తూరు (Chittoor) జిల్లాలో గురువారం ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల (Heavy rains) కారణంగా రేణిగుంట విమానాశ్రయంలో (renigunta airport) విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. తిరుమలలో కొండచరియలు విరిగిపడ్డాయి.

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో అటు తమిళనాడుతో పాటు ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. చిత్తూరు  (Chittoor) జిల్లాలో గురువారం ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి రూరల్, చంద్రగిరి మండలాల్లో వర్ష భీభత్సం సృష్టించింది. భారీ వర్షాల కారణంగా రేణిగుంట విమానాశ్రయంలో (renigunta airport) విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం అనుకూలించక రేణిగుంటలో ల్యాండ్ కావాల్సిన విమానాలు తిరిగి వెనక్కి వెళ్తున్నాయి. ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ విమానాలు వాతావరణం అనుకూలించకపోవడంతో.. హైదరాబాద్ వెనుదిరిగి వెళ్లాయి. మరోవైపు హైదరాబాద్ నుంచి రేణిగుంట వస్తున్న ఇండిగో విమానాన్ని విమానాశ్రయం అధికారులు బెంగళూరుకు మళ్లించారు.  

ఇలా తిరుపతి, తిరుమలలో భారీ వర్షాల కారణంగా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుమల కనుమ దారిలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఘాట్ రోడ్డులు కొన్ని చోట్ల జలపాతాలను తలపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొండ చరియలు, చెట్లు విరిగి పడుతున్నాయి.  

Also Read: AP Rains Update:హై అలర్ట్... 24గంటల్లో ఏపీలో భారీ నుండి అతిభారీ వర్షాలు (వీడియో)

ఈ క్రమంలోనే టీటీడీ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అలిపిరి, శ్రీవారి కాలినడక మార్గాలతో పాటుగా పాపవినాశనం రోడ్డును మూసివేశారు. తిరుపతి నగరంలో కూడా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రామచంద్రాపురం నుంచి తిరుపతికి రాకపోకలు నిలిచిపోయాయి.

ఇక, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు. మరీముఖ్యంగా రాబోయే 24 గంటల్లో నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో అతి భారీ వర్షాలు... ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా జిల్లాల్లో కొన్నిచోట్ల heavy rains కురిసే అవకాశం ఉందని తెలిపారు.  

వాయుగుండం గా మారిన అల్పపీడనం నైరుతి బంగాళాఖాతం మీదుగా చెన్నైకి ఆగ్నేయంగా 310 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు వెల్లడించారు. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ రేపు(శుక్రవారం) ఉదయం ఉత్తర తమిళనాడు-దక్షిణ కోస్తాంధ్ర తీరాన్ని దాటనుందని వాతావరణ శాఖ ప్రకటించింది.  వాయుగుండం తీరందాటే సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం వుంటుంది. అలాగే సముద్రం కూడా అల్లకల్లోలంగా వుంటుంది కాబట్టి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.కొస్తాంద్ర తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించారు. దీని ప్రభావంతో రాయలసీమ వ్యాప్తంగా  తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిస్తాయని తెలిపారు.

click me!