వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీకి హైకోర్టు కీలక ఆదేశాలు

By Siva KodatiFirst Published Jan 3, 2020, 2:32 PM IST
Highlights

తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. జనవరి 6లోపు తుది నిర్ణయం తీసుకోవాలని టీటీడీని న్యాయస్థానం ఆదేశించింది. 

తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. జనవరి 6లోపు తుది నిర్ణయం తీసుకోవాలని టీటీడీని న్యాయస్థానం ఆదేశించింది.

సాధారణ భక్తుల కోసం పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనాన్ని కొనసాగించాలని కోరారు పిటిషనర్. దీనిపై స్పందించిన హైకోర్టు .. బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసి త్వరగా నిర్ణయం తెలపాల్సిందిగా కోరింది. అయితే తుది నిర్ణయం విషయంలో తమ జోక్యం ఉండదని న్యాయస్థానం తెలిపింది.

Also Read:తిరుమల వెంకన్న భక్తులకు తీపికబురు... కీలక నిర్ణయం దిశగా టిటిడి

ఎక్కువ మంది భక్తులు వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలకు వస్తుండటంతో ఆ రెండు రోజులు తీవ్ర రద్దీ ఉంటోందని.. ఆ తర్వాత ద్వారాలు మూసివేయడం వల్ల సామాన్యులకు దర్శనం ఉండటం లేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చాడు. అందువల్ల 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం కొనసాగించాలని కోరాడు. వాదనల సందర్భంగా టీటీడీ స్పెషల్ ఆఫీసర్ ధర్మారెడ్డి కోర్టుకు హాజరయ్యారు.

మరోవైపు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈ నెల 6, 7 తేదీల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు మెరుగైన దర్శనం, ఇతర సౌకర్యాలను కల్పించినట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

తెల్లవారుజామున చలిలో ఇబ్బంది పడకుండా 85 వేల మంది భక్తులు సేదదీరేలా షెడ్లను నిర్మించామని, 3 లక్షల నీటి బాటిళ్లను సమకూర్చామన్నారు. అంతేకాకుండా క్యూలైన్లలో భక్తులకు నిరంతరం అన్నప్రసాదం, పాలు అందిస్తామని అనిల్ వెల్లడించారు.

Also Read:శ్రీవారి భక్తులకు శుభవార్త: 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాల గుండా దర్శనం

ఏకాదశి రోజున తెల్లవారుజామున 1.30 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభిస్తామని ఈవో పేర్కొన్నారు. వీఐపీ పాసులున్న వారికి 3 గంటల్లో దర్శనం చేయిస్తామని.. ఉదయం 5 గంటలకే సర్వదర్శనం ప్రారంభిస్తామన్నారు. 

click me!