బతికుంటే కలుస్తా: సూసైడ్‌కు ముందు భార్యతో గురువారెడ్డి, సెల్పీ వీడియో

First Published Jul 3, 2018, 12:56 PM IST
Highlights

అత్తింటి వేధింపులు భరించలేక భర్త మృతి, సెల్పీ వీడియో


విజయవాడ: భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యుల వేధింపులు భరించలేక ఓ వ్యక్తి రైలు కింద పడి మంగళవారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా విజయవాడలో చోటు చేసుకొంది.  ఆత్మహత్య చేసుకొనే ముందు గురువారెడ్డి అనే వ్యక్తి  తన ఆత్మహత్యకు గల కారణాన్ని సెల్పీ వీడియోలో రికార్డు చేశాడు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

గాయత్రి, గురవారెడ్డి భార్య, భర్తలు. అయితే గాయత్రితో పాటు ఆమె కుటుంబసభ్యులు తనను వేధింపులకు గురి చేశారని మృతుడు సెల్పీ వీడియో తీసుకొన్నాడు. ఏ తప్పు చేయకున్నా  తనను రెండు రోజుల పాటు పోలీస్‌స్టేషన్‌లో ఉంచేలా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తన భార్యపై తనకున్న ప్రేమను కూడ ఆయన చివరగా వ్యక్తం చేశారు. తాను తన భార్యను ప్రేమగా చూసుకొన్నా...ఆమె తనను ఇబ్బంది పెట్టిందని చెప్పారు. తల్లిదండ్రులతో పాటు ఇతరుల మాటలను విని తనను ఇబ్బందిపెట్టిందని గురువారెడ్డి భార్య గాయత్రిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

తాను చనిపోవాలని నిర్ణయించుకొన్నాని చెబుతూ తనను క్షమించాలని తల్లిదండ్రులను కోరుకొన్నాడు. తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని సోదరుడికి సూచించాడు..బతికుంటే మళ్లీ కలుద్దామని భార్య గాయత్రికి చివరి సారిగా సెల్పీ వీడియోలో చెప్పాడు. 

ఈ వీడియో రికార్డింగ్ చేసిన కొద్దిసేపటికే గురువా రెడ్డి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారెడ్డి కుటుంబసభ్యులు  పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 

click me!