మానస సరోవర్ యాత్రకు వెళ్లి ఇద్దరు యాత్రికులు మృతి
అమరావతి: మానస సరోవర్ యాత్రకు వెళ్లిన యాత్రికుల్లో ఇద్దరు మృతి చెందారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు యాత్రికులు మృత్యువాత పడ్డారు. మృతదేహాలను స్వంత రాష్ట్రాలను రప్పించేందుకు అధికారులు చర్యలు తీసుకొంటున్నారు.
గత నెల 24వ తేదీన విజయవాడ నుండి మానస సరోవర్ యాత్రకు ఏపీ రాష్ట్రం నుండి వంద మందికి పైగా వెళ్లారు. మానస సరోవర్ వరకు వెళ్లి తిరిగి ప్రయాణమైన యాత్రికులు వాతావరణం అనుకూలించని కారణంగా అక్కడే చిక్కుకుపోయారు.
సుమారు చైనా-నేపాల్ సరిహద్దుల్లో వేలాది మంది యాత్రికులు చిక్కుకుపోయారు. చిక్కుకున్న యాత్రికులను స్వరాష్ట్రానికి తరలించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు.
అయితే ఈ యాత్రకు వెళ్లిన తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన సుబ్బారావు అనే వ్యక్తి మృత్యువాత పడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా చాగల్లుకు చెందిన తోట రత్నం అనే మహిళ కూడ మృతి చెందింది.
సరిహద్దుల్లో చిక్కుకొన్న వారిని రప్పించడంతో పాటు మృతదేహాలను కూడ స్వగ్రామాలకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాతావరణం మాత్రం అనుకూలించడం లేదు. వాతావరణం అనుకూలిస్తే హెలికాప్టర్ల సహాయంతో యాత్రికులను రప్పించేందుకు చర్యలు తీసుకొంటున్నట్టు అధికారులు ప్రకటించారు.