చంద్రబాబు ఇంటిపై దాడి: వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ కు డిఐజీ క్లీన్ చిట్

By telugu teamFirst Published Sep 21, 2021, 8:10 AM IST
Highlights

వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తన అనుచరులతో మాజీ సీఎం చంద్రబాబు నివాసంపై దాడి చేశారంటూ వచ్చిన ఆరోపణలను డిఐజీ తివిక్రమ వర్మ కొట్టిపారేశారు. మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారమయ్యాయని ఆయన అన్నారు.

గుంటూరు: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై ఇంటిపై దాడి చేశారనే ఆరోపణపై గుంటూరు రేంజ్ డిఐజీ త్రివిక్రమ వర్మ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ కు క్లీన్ చిట్ ఇచ్చారు. చంద్రబాబు నివాసంపై దాడి చేశారని మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పారు. 

పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ చంద్రబాబుతో మాట్లాడడానికి మాత్రమే వెళ్లారని, ఇంటిపై దాడి చేసే ఉద్దేశంయో ఆయనకు లేదని త్రివిక్రమ వర్మ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రమేష్ తన అనుచరులతో వస్తుండగా కరకట్ట వద్ద పోలీసులు ఆపేశారనని, తర్వాత రెండో మూడో చెక్ పోస్టుల వద్ద భద్రతా సిబ్బంది ఆపేందుకు యత్నించారని ఆయన వివరించారు. చంద్రబాబు ఇంటి ప్రహారీ వద్దనే జోగి రమేష్ ను ఆపేసినట్లు ఆయన తెలిపారు. 

Also Read: చంద్రబాబు నివాసం వద్ద జోగీ రమేశ్‌పై దాడి: 11 మంది టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసు

రమేష్ 350 మీటర్ల దూరంలో ఉండిపోయారని, ఎమ్మెల్యే కారును మొదట టీడీపీ కార్యకర్తలు ఆపేశారని, రాయితో అద్దాలు పగులగొట్టారని, డ్రైవర్ ను చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించారని, వీడియోల ఆధారంగా నిందితులపై కేసులు నమోదు చేశామని త్రివిక్రమ వర్మ చెప్పారు. 

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంపై దాడి చేశారని మీడియాలో ప్రసారం చేయడం ఎంత మేరకు సమంజసమని ఆయన అడిగారు. అదే రోజు సాయంత్రం 70 మంది టీడీపీ కార్యకర్తలు గుంపులుగా డీజీపీ కార్యాలయానికి వచ్చి గేటు తన్నేసి లోపలికి చొరబడి గందరగోళం సృష్టించారని ఆయన ఆరోపించారు. వినతిపత్రం సమర్పించడానికి వచ్చే పద్ధతి అదేనా అని ఆయన అడిగారు. ఈ ఘటనపై కూడా తాము కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. 

జోగి రమేష్ ఘటనపై తెలిసిన వెంటనే పోలీసులు స్పందించారని, వాస్తవాలు నిర్ధారించుకోకుండా కథనాలు ప్రసారం చేయడం మంచిది కాదని గుంటూరు అర్బన్ ఎ్సపీ ఆరిఫ్ హ హఫీడ్, ఎస్పీ విశాల్ గున్నీ అన్నారు. 

click me!