విజయవాడ నుండి విశాఖపట్టణం వైపునకు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గామన్ బ్రిడ్జి కుంగిపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.
కాకినాడ:ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని గామన్ బ్రిడ్జి కుంగిపోయింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలకు ఇబ్బందులు నెలకొన్నాయి.తూర్పు గోదావరి జిల్లాలోని దివాన్ చెరువు నుండి కొవ్వూరు వరకు గోదావరి నదిపై గామన్ బ్రిడ్జిని నిర్మించారు.
గామన్ బ్రిడ్జిపై 52వ స్థంభం జాయింట్ వద్ద అర అంగుళం కుంగింది. కొవ్వూరు నుండి రాజమండ్రి వైపు వెళ్లే దారిలో బ్రిడ్జిపై వంతెన కుంగిపోయింది. దీంతో ఈ బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఇవాళ నిపుణులు బ్రిడ్జిని పరిశీలించనున్నారు.
ఈ వంతెనకు ఉన్న బేరింగ్ ల మరమ్మత్తుల కారణంగానే బ్రిడ్జి కుంగిపోయిందనే ప్రచారం సాగుతుంది. 2007లో గోదావరి నదిపై ఈ బ్రిడ్జిని రూ. 800 కోట్లతో నిర్మించారు.అయితే 2015లో ఈ బ్రిడ్జిపై రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఈ బ్రిడ్జి కుంగిపోవడంతో విజయవాడ నుండి విశాఖపట్టణం వైపు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనదారులను పోలీసులు పంపుతున్నారు.బ్రిడ్జి ఎందుకు కుంగిపోయిందనే విషయమై ఇవాళ నిపుణులు పరిశీలించిన తర్వాత స్పష్టత రానుంది. నిపుణులు పరిశీలించిన తర్వాత బ్రిడ్జి మరమ్మత్తులు చేపట్టనున్నారు.