
భారత దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ సంక్షోభంలో చిక్కుకుందని కేరళ సీనియర్ జర్నలిస్టు సిద్దఖీ కప్పన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని మొఘల్ రాజపురం సిద్దార్థ కాలేజీ ఆడిటోరియంలో శనివారం విప్లవ రచయితల సంఘం 29 వ మహాసభలు నిర్వహించారు. ఆ సంఘం అధ్యక్షుడు అరసవిల్లి కృష్ణ సమావేశానికి అధ్యక్షత వహించిన ఈ రాష్ట్ర మహాసభలకు జర్నలిస్టు సిద్దిఖీ కప్పన్ ప్రధాన వక్తగా హాజరై మాట్లాడారు. సంక్షోభ కాలంలో విరసం చేపట్టిన సభలను అభినందించారు.
బీహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా.. త్వరలో బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు
రాజ్యాంగవాద ఆలోచనలు కూడా సంక్షోభంలో ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రజలు సనాతనవాద ముంగిట్లో ఉన్నారని అన్నారు. రాజ్యాంగ మౌలిక అంశాలలో ఎంతో వైవిధ్యం ఉందని తెలిపారు. రాజ్యాంగాన్ని అధికారంలో ఉన్న పాలకులు దుర్వినియోగం చేస్తున్న విధానాన్ని ప్రజలు గుర్తించాలని అన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడుకోవడానికి జాగరూకతలో ఉండాలని చెప్పారు.
అనంతరం సభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ప్రముఖ కవి జి.లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ.. ప్రధాని మోడీ రామభక్తిని దేశభక్తిగా ప్రచారం చేయడం విడ్డూరంగా ఉన్నదని అన్నారు. రాజ్యాంగవాద స్పూర్తి పైన దళిత బహుజనులకు స్పష్టత ఉందని తెలిపారు. ప్రస్తుత రాజ్యాంగం వల్ల పెట్టుబడిదార్ల కంటే దళిత బహుజన వర్గాలకు లాభం జరిగిందని తెలిపారు. హిందూత్వ రాజ్యం వస్తే ఏమీ చేయాలో ప్రస్తుతం బీజేపీ అదే అమలు చేస్తోందని ఆరోపించారు. యూపీలో ముస్లిం మైనారటీలు తమ పేర్లు చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారని తెలిపారు.
ఇండియా కూటమిని వీడుతున్నా.. నా రాజీనామాకు కారణం అదే..- నితీష్ కుమార్
విరసం సీనియర్ సభ్యురాలు పి.వరలక్ష్మి ‘‘ఫాసిస్ట్ సందర్భంలో రాజ్యాంగ వాదం’’ అనే అంశం పై మాట్లాడుతూ.. బ్రాహ్మణీయ హిందుత్వవాదం దేశంలోని అన్ని రంగాలను చేజిక్కించుకుందని తెలిపారు. దాంతో ప్రజాస్వామిక విలువలను, సహజ జీవన సంస్కృతిని ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లౌకిక ప్రజాస్వామ్య శక్తులు ఈ దాడిని గుండె దిటవుతో ఎదుర్కొంటున్నాని అన్నారు. బ్రాహ్మణీయ హిందుత్వ ఆర్థిక రంగంలో కార్పొరేట్ హిందుత్వ ఫాసిజంగా విస్తరిస్తుందని ఆరోపించారు. ఈ మహాసభల్లో భాగంగా ముందుగా అరణపతాకాన్ని కవి సంగ్రామ్ ఆవిష్కరణ చేశారు. తరువాత అమరవీరుల స్తూపాన్ని వీరమ్మ ఆవిష్కరించారు.