శుక్రవారం రాత్రి నుండి కురుస్తున్న అకాల వర్షాలు శ్రీకాకుళం జిల్లాలో విషాదాన్ని నింపాయి.
శుక్రవారం రాత్రి నుండి కురుస్తున్న అకాల వర్షాలు శ్రీకాకుళం జిల్లాలో విషాదాన్ని నింపాయి. ఈదురుగాలులతో కురిసిన వర్షానికి తోడు పిడుగులు పడటంతో నలుగురు మృత్యువాతపడ్డారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అంతేకాకుండా భారీసంఖ్యలో మూగజీవాలు మృత్యువాతపడ్డాయి.
ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం గీతనాపల్లి మరియు శ్రీహరిపురం గ్రామంలో సాలాపు శ్రీరాములు, శానాపతి అచ్యుతరావు, వడ్డాపు శంకర్రావులు పిడుగుపాటుకు గురయి మృతి చెందారు. అలాగే ఈ గ్రామాల్లో దాదాపు గ్రామంలో 14 గొర్రెలు మృతి చెందాయి.
ఇక సీతంపేట మండలం తుంబకొండ గ్రామంలో ఆరిక ఆనందరావు అనే వ్యక్తి కూడా పిడుగుపాటుకు గురయి మృతి చెందాడు. నిమ్మక గోపి అనే వ్యక్తి పిడుగుపాటు కారణంగా తీవ్ర గాయాలకు గురయి ఆస్పత్రిపాలయ్యాడు. అతడి పరిస్థితి విషమంగా మారడంతో పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.
కర్నూల్ జిల్లాలోనూ ఈ వర్షం కారణంగా మూగజీవులు బలయ్యాయి. బేతంచెర్ల మండల పరిధిలోని ఆర్ కొత్తపల్లి గ్రామంలో తెల్లవారుజామున పిడుగుపాటుకు గురై 55 మేకలు మృతి చెందాయి. ఇలా పిడుగుపాట్లు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.