
శ్రీకాకుళం: మజీ ఎంపీ, బీజేపీ నేత కణితి విశ్వనాథం మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పలాసలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకులలో కణితి విశ్వనాథం ఒక్కరు. కణితి విశ్వనాథం మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. కణితి విశ్వనాథం 1932 జూలై 1న శ్రీకాకుళం జిల్లాలోని హరిదాసుపురంలో జన్మించారు. ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు. డాక్టర్గా, విద్యావేత్తగా మంచిపేరు తెచ్చుకున్నారు.
ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కణితి విశ్వనాథం.. శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున 1989, 1991లలో రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితుడిగా ఆయనకు పేరు ఉండేంది. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ ఏర్పాటు తర్వాత.. ఆయన ఆ పార్టీలో చేరారు. అయితే 2014లో వైసీపీకి గుడ్ బై చెప్పిన కణితి విశ్వనాథం బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఆయన బీజేపీలోనే కొనసాగారు. ఇక, కణితి విశ్వనాథం.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యుడిగా 34 ఏళ్ల పాటు కొనసాగారు.
కణితి విశ్వనాథం మృతిపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తీవ్ర దిగ్భ్రంతి వ్యక్తం చేశారు. ‘‘శ్రీకాకుళం మాజీ పార్లమెంట్ సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ కణితి విశ్వనాథం గారి మరణం దిగ్భ్రాంతిని కలిగించింది . వారి పవిత్ర ఆత్మకు సద్గతులు చేకూర్చాలని భగవంతుని ప్రార్ధిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను’’ అని సోము వీర్రాజు ట్వీట్ చేశారు.