
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు.ఈ మేరకు టీడీపీ నాయకత్వం చర్చలు జరుపుతున్నారు.ఏపీ సీఎం చంద్రబాబునాయుతో పాటు, టీడీపీ ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కళా వెంకట్రావుతో కొందరు నేతలు చర్చిస్తున్నారు. తాము కోరుకొన్న నియోజకవర్గాలను ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారు.
2014 ఎన్నికల వరకు ఏపీ రాష్ట్రంలో కీలకంగా వ్యవహరించిన కొందరు మాజీ ఎమ్మెల్యేలు ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీలో చేరేందుకు కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ మేరకు టీడీపీ కీలక నేతలతో కాంగ్రెస్ పార్టీ నేతలు టచ్లోకి వెళ్లారు. ఆయా జిల్లాల్లోని పార్టీ నేతలతో టీడీపీ అధిష్టానం చర్చలు జరుపుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన కొండ్రుమురళి టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఈ మేరకు మాజీ మంత్రి కొండ్రు మురళి ఏపీ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుతో చర్చించినట్టు సమాచారం.
కొండ్రు మురళి రాజాం టిక్కెట్టును ఆశిస్తున్నారు. కొండ్రు మురళి టీడీపీలోకి రావడాన్ని మాజీ మంత్రి ప్రతిభా భారతి వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం . అయితే కొండ్రు మురళి టీడీపీలోకి వస్తే తనకు ఇబ్బందులు ఉంటాయని ప్రతిబా భారతి భావిస్తున్నారని సమాచారం. అయితే ఈ విషయమై టీడీపీ నాయకత్వం మేథోమథనం చేస్తోంది.
వచ్చే ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది.ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో బలమైన నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించాలని టీడీపీ భావిస్తోంది.
మరో వైపు ప్రకాశం జిల్లా మాజీ ఎమ్మేల్యే ఉగ్ర నరసింహారెడ్డిని కూడ టీడీపీలోకి వచ్చేందుకు రంగం సిద్దం చేసుకొన్నారని ప్రచారం సాగుతోంది. ఉగ్ర నరసింహారెడ్డి గురువారంనాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారు. ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీలో చేర్చుకొనే విషయమై ఎమ్మెల్యే, టీడీపీ నేత కదిరి బాబురావుతో టీడీపీ నాయకత్వం చర్చిస్తోంది.