టీడీపీకి మరో అస్త్రాన్ని అందించిన బొత్స: ఇక చంద్రబాబు దూకుడే....

By Nagaraju penumalaFirst Published Nov 26, 2019, 11:38 AM IST
Highlights

అమరావతి అభివృద్దిపై చిత్తశుద్ధి ఉంటే సీఎం జగన్ మంత్రి బొత్సను వెంటనే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలి అని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామంటూ హెచ్చరించారు చంద్రబాబు నాయుడు. 
 

అమరావతి: ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీకి మరో అస్త్రాన్ని అందించారు. గతంలోనే రాజధానిపై బొత్స చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు బొత్స సత్యనారాయణ. 

గతంలో రాజధాని నిర్మాణంపై కమిటీ వేశామని, నివేదిక ఆధారంగా నిర్మాణాలు ఉంటాయంటూ అటు రైతుల్లోనూ ఇటు ప్రజల్లోనూ గందరగోళానికి తెరలేపిన బొత్స సత్యనారాయణ తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఈనెల 28న రాజధానిలో పర్యటించాలని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు భావించారు. చంద్రబాబు పర్యటనపై బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. 

రాజధాని శ్మశానాన్ని చూసి ఏడవడానికి వస్తున్నావా చంద్రబాబు అంటూ బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే టీడీపీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మాజీమంత్రి యనమల రామకృష్ణుడు అయితే ఏకంగా ప్రివిలేజ్ నోటీసులు ఇస్తామంటూ హెచ్చరించారు. 

ఏపీలో కాకరేపుతున్న బొత్స స్మశాన వ్యాఖ్యలు: మంత్రి బర్తరఫ్ కు టీడీపీ డిమాండ్

ఇదే అంశంపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అద్భుత నగరంగా తీర్చిదిద్దాలనేది ప్రతి ఆంధ్రుడి ఆకాంక్ష అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 

టీడీపీ హయాంలో రూ.52 వేల కోట్ల విలువైన నిర్మాణాలతో, వేలాది కార్మికులతో కళకళలాడుతూ, పర్యాటక జన సందోహంతో నిత్య సందడిగా అమరావతి ఉండేదని చెప్పుకొచ్చారు. అలాంటి  సజీవ స్రవంతి అమరావతిని స్మశానంగా శత్రువు కూడా పోల్చరంటూ విమర్శించారు.  

కానీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రజారాజధానిని శ్మశానంతో పోల్చి 5కోట్ల ఆంధ్రులనే కాదు, శంకుస్థాపనకు వచ్చిన ప్రముఖులను సైతం అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో ఉన్న విశ్వవిద్యాలయాలు మీకు స్మశానాలా? హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్ మీ కళ్లకు స్మశానాల్లా కనిపిస్తున్నాయా అంటూ చంద్రబాబు రెచ్చిపోయారు. 

రైతుల త్యాగాలను అవహేళన చేస్తారా? నిర్మాణాల్లో చెమటోడ్చిన కూలీల శ్రమను ఎగతాళి చేస్తారా? ప్రజల మనోభావాలను గౌరవించలేని బొత్సకు మంత్రిగా కొనసాగే హక్కు లేదంటూ ధ్వజమెత్తారు చంద్రబాబు నాయుడు. 

అమరావతిని స్మశానంగా మిగిల్చారు: చంద్రబాబుపై బొత్స ఫైర్

అమరావతి అభివృద్దిపై చిత్తశుద్ధి ఉంటే సీఎం జగన్ మంత్రి బొత్సను వెంటనే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలి అని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామంటూ హెచ్చరించారు చంద్రబాబు నాయుడు. 

click me!