విజయవాడలో కరోనా వైరస్ చికిత్స కోసం రమేష్ హాస్పిటల్ ఉపయోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ బిల్డింగ్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
విజయవాడలో కరోనా వైరస్ చికిత్స కోసం రమేష్ హాస్పిటల్ ఉపయోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ బిల్డింగ్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఒక్కసారిగా బిల్డింగ్ లో మంటలు వ్యాపించాయి. ఈ సమయంలో హాస్పిటల్ లో 40మంది కరోనా పేషంట్స్ తో పాటు 10 మంది వరకు వైద్య సిబ్బంది వున్నట్లు సమాచారం. ఈ మంటలు బిల్డింగ్ మొత్తం వ్యాపించడంతో దట్టమైన పొగలు బిల్డింగ్ లో వున్నవారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. దీంతో వారు కిటీకీల వద్దకు చేరుకుని సహాయం కోసం ఆర్తనాదాలు చేశారు.
అయితే ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా పలువురు గాయాలపాలయ్యారు. ఇప్పటి వరకూ 10మంది మృతదేహాలను అధికారులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్లో 50 మంది ఉన్నట్లు తెలియవచ్చింది. బాధితులను లబ్బీపేట, మెట్రోపాలిటన్ హోటల్, కోవిడ్ కేర్ సెంటర్లకు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా శ్వాస సమస్యలతో బాధపడుతున్నవారికి మంటల కారణంగా దట్టమైన పొగల ఆవరించడంతో ఆ సమస్య మరీ ఎక్కువయ్యింది. అలాగే కాలిన గాయాలతో మరికొందరు చికిత్స పొందులున్నారు.
అగ్ని ప్రమాద ఘటనలో మృతుల వివరాలు...
రమేష్, విజయవాడ
పూర్ణ చంద్ర రావు, మొవ్వ
డోక్కు శివ బ్రహ్మయ్య, మచిలీపట్నం
మజ్జి గోపి, మచిలీపట్నం
అబ్రహం,జగ్గయ్య పేట
రాజకుమారి, జగ్గయ్యపేట
సుంకర బాబు రావు, సింగ్ నగర్ (రిటైర్డ్ ఎస్సై)
వెంకట లక్ష్మి సువర్చలా దేవి, కందుకూరు
సువర్ణలత పొన్నూరు, నిడుబ్రోలు
ఇంకా ముగ్గురి మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. కాగా ఈ పది మంది మృతదేహాల పోస్టుమార్టం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రక్రియ అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించున్నారు.
మరోవైపు బెజవాడ ప్రమాద ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. రమేష్ ఆస్పత్రి, స్వర్ణ ప్యాలెస్ యజమాన్యాలపై బెజవాడ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హోటల్, ఆసుపత్రి రెండింటిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు మీడియాకు వెల్లడించారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే హాస్పిటల్ వద్దకు చేరుకుని మంటలను అదుపు చేశారు. అనంతరం ఈ ప్రమాదంలో మరింత అస్వస్ధతకు గురయిన పేషెంట్స్ ఇతర హాస్పిటల్స్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు.
read more ఆ విషయం తెలియగానే తీవ్ర మనస్తాపానికి గురయ్యారు: చంద్రబాబు (వీడియో)
షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుని వుంటుందని... మంటలను ఎవ్వరూ గమనించకపోవడంతో బిల్డింగ్ మొత్తం వ్యాపించి వుంటాయని అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఈ దుర్ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఏపి గవర్నర్ బిస్వభూషన్ హరిచందన్, సీఎం జగన్, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తో పాటు మంత్రులు, ప్రజాప్రతినిశులు స్పందించారు. ఈ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున ఆర్థిక సాయం, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని వైసిపి ప్రభుత్వం ప్రకటించింది.