
డిజిటల్ విప్లవానికి నాందిగా ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసిన ఫైబర్ గ్రిడ్ సేవలు సంక్రాంతి నుంచి ప్రారంభం కానున్నాయి.
నెలకు కేవలం రూ. 149 కే ప్రజలకు టీవీ ప్రసారాలు, హైస్పీడ్ ఇంటర్నెట్ తో పాటు టెలిఫోన్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ఈ సేవలను ప్రకటించింది.
ఇప్పటికే కొన్ని టెలికాం సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. అంతేకాకుండా లక్ష సీపీఈ బాక్సులు సిద్ధం చేసింది. ఇంకా మరో 10 లక్షల బాక్సులను కోనుగోలు చేయనుంది.
ఇప్పటికే ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి 100 కోట్ల రూపాయలతో పాటు బ్యాంకుల నుంచి తీసుకునే రూ.300 కోట్లతో కలిపి ఈ 10 లక్షల బాక్సులను కొనుగోలు చేయాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
దక్షిణ కొరియా, చైనాల నుంచి సెట్ టాప్ బాక్సులను కొనుగోలు చేయనున్నారు. జనవరి 14 సంక్రాంతి పండగ నాటికి ఫైబర్ గ్రిడ్ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
మొదటి విడతగా నెల రోజుల్లో లక్ష ఇళ్లకు ఫైబర్ గ్రిడ్ ద్వారా కేబుల్ టీవీ, ఉచిత టెలిఫోన్, ఇంటర్ నెట్ కనెక్షన్ 15 ఎంబీపీఎస్ అందజేయనున్నారు. ఇందుకు కేవలం వినియోగదారుల నుంచి 149 రూపాయలు మాత్రమే వసూలు చేయనున్నారు. ప్రైవేట్ సంస్థలు ఇష్టాను సారం కేబుల్ లైన్లు వేయకుండా ఉండేలా ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
కేవలం ఫైబర్ గ్రిడ్ లైన్ నుంచే కనెషన్లు తీసుకోనేలా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు. కేవలం టీవీ ద్వారా ఛానళ్ల ప్రసారాలే కాకుండా ఫైబర్ గ్రిడ్ అందిస్తున్న యాప్ ద్వారా ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలపై లఘు చిత్రాల ప్రదర్శన,దూర ప్రాంతాల్లో ఉన్న వారికి వైద్య సేవలు పొందే అవకాశం ఉంటుంది.