సహజీవనం, గర్భందాల్చిన ప్రియురాలు, బిడ్డకు జన్మనిచ్చి మృతి.. పసికందును ముళ్లపొదల్లోకి విసిరేసిన తండ్రి

By Siva KodatiFirst Published Dec 27, 2022, 2:46 PM IST
Highlights

ఎన్టీఆర్ జిల్లాలో దారుణం జరిగింది. కన్నబిడ్డను ముళ్లపొదల్లోకి విసిరేశాడో తండ్రి. నిందితుడిని మచిలీపట్నానికి చెందిన షాబాజ్‌గా గుర్తించిన పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. 

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కర్కశంగా ప్రవర్తించాడో తండ్రి. కన్నబిడ్డ అని కూడా చూడకుండా పసిబిడ్డను నిర్దాక్షణ్యంగా ముళ్ల పొదల్లో పడేశాడు. చిన్నారి ఏడుపు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బిడ్డను రక్షించారు. గుడివాడకు చెందిన దివ్య, మచిలీపట్నానికి చెందిన షాబాజ్‌లు గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. ఇద్దరూ హైదరాబాద్‌లో కలిసే వుంటున్నారు. ఈ క్రమంలో ఈ నెల 23న దివ్యకు పురిటి నొప్పులు రావడంతో ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించాడు షాబాజ్. 

అయితే ప్రసవ సమయంలో ఫిట్స్ రావడంతో బిడ్డకు జన్మనిచ్చి దివ్య మృతి చెందింది. దీంతో ఆమె మృతదేహంతో పాటు బిడ్డను తీసుకుని అంబులెన్స్‌లో గుడివాడకు బయల్దేరాడు. అయితే మార్గమధ్యంలో పసికందును ఇబ్రహీంపట్నం మండలం దొనబండ వద్ద ముళ్లపొదల్లో వదిలేసి వెళ్లిపోయాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో వారు పసికందును కాపాడి గన్నవరంలోని షేర్ అండ్ కేర్ సంస్థకు అప్పగించారు. అనంతరం షాబాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 

click me!