
విజయవాడ: ఫేస్బుక్ పరిచయం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కృష్ణలంక మెట్లబజార్కు చెందిన లంక రామాంజనేయులుశర్మ పౌరోహిత్యం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. రామాంజనేయులు శర్మకు బాలాజీనగర్కు చెందిన ఒక వివాహితతో ఫేస్బుక్లో పరిచయం అయ్యింది. అప్పుడప్పుడు ఇద్దరూ చాటింగ్ చేసుకుంటూ...ఫోన్లో మాట్లాడుకుంటున్నారు.
అయితే భార్య చాటింగ్, ఫోన్లో మాట్లాడటాన్ని గమనించిన భర్త సాయి శ్రీనివాస్ ఆమె ఫోన్ ను పరిశీలించాడు. రామాంజేయులుశర్మతో చాటింగ్ చేస్తున్నట్లు, మాట్లాడుతున్నట్లు నిర్ధారించుకున్నాడు. కోపోద్రిక్తుడైన సాయి శ్రీనివాస్ రామాంజనేయులుశర్మను ఎలాగైనా మట్టుపెట్టాలనుకున్నాడు. ఈ నెల 15న అతనికి ఫోన్చేసి గవర్నరుపేటలోని ఎన్టీఆర్ కాంప్లెక్స్లోని తన షాపునకు రావాలని పిలవడంతో రామాంజేనేయులు శర్మ వెళ్లాడు.
అప్పటికే హత్యకు పథకం పన్నిన సాయి శ్రీనివాస్ సెల్లార్ లో తన ఐదుగురు స్నేహితులతో కలసి రామాంజనేయులు శర్మను విచక్షణారహితంగా కొట్టారు. శర్మ గట్టిగా అరవడంతో స్థానికులు వచ్చి అడ్డుకున్నారు. స్నేహితుల మధ్య చిన్న గొడవే అని సర్ధిచెప్పి ద్విచక్రవాహనంపై రామాంజనేయులు శర్మను తేలప్రోలు పరిసరాల్లోని పంటపోలాల్లోకి తీసుకెళ్లారు.
అక్కడ మద్యం తాగి మళ్లీ కొట్టారు. దీంతో స్పృహ కోల్పోయిన రామాంజనేయులు శర్మను మళ్లీ ద్విచక్ర వాహనంపై విజయవాడ వైపు తీసుకువస్తుండగా గన్నవరం బిస్మిల్లా హోటల్ సమీపం వద్ద రామాంజనేయులుశర్మ మృతిచెందాడు. ఈ విషయాన్ని గమనించిన సాయి శ్రీనివాస్ అతని స్నేహితులు రోడ్డు పక్కన మృతదేహాన్నిపడేసి నట్లు 108కి ఫోన్చేసి పరారాయ్యారు. 108 సిబ్బంది వచ్చి చూసేసరికి అప్పటికే మృతి చెందడం...చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో108 సిబ్బంది సైతం వెళ్లిపోయింది.
అయితే తన భర్త ఈనెల 15 నుంచి కనిపించడం లేదని రామాంజనేయులు శర్మ భార్య స్వరూప కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు గన్నవరంలో లభించిన గుర్తు తెలియని మృతదేహం....రామాంజనేయుల శర్మదేనని నిర్ధారించి మరింత విచారణ చేపట్టారు. మృతుడి కాల్ డేటా పరిశీలించగా చివరి సారిగా సాయి శ్రీనివాస్ తో మాట్లాడినట్లు ఉండటంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా తామే హత్య చేసినట్లు అంగీకరించాడు. హత్యకు సహకరించిన స్నేహితులను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.