ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్ ... దసరా సెలవుల పొడిగింపుతో కలిసొచ్చిన మరో హాలిడే, మొత్తం ఎన్నిరోజులో తెలుసా?

By Arun Kumar PFirst Published Sep 28, 2024, 5:29 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు దసరా సెలవులు పొడిగించారు. దీంతో మొత్తం 11 రోజుల దసరా సెలవులు వుంటే... మరో హాలిడే వీటికి కలిసివచ్చి వరుసగా 12 రోజుల సెలవులు వచ్చాయి.  

Dussehra Holidays in Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులు ఎగిరిగంతేసే గుడ్ న్యూస్ వెల్లడించారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. తెలుగు ప్రజల పెద్దపండగ దసరా సందర్భంగా సెలవులపై ఆయన క్లారిటీ ఇచ్చారు. లోకేష్ చొరవతో ముందుగా నిర్ణయించినట్లు కాకుండా మరో రెండ్రోజుల సెలవులు  విద్యార్థులకు కలిసివచ్చాయి. ఇలా ఏపీ విద్యార్థులకు ఈ దసరాకు ఏకంగా 12 రోజుల సెలవులు వస్తున్నాయి.

ఏపీలో దసరా సెలవులపై  క్లారిటీ :  

ఈ ఏడాది దసరా పండక్కి పది రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ఏపీ విద్యాశాఖ క్యాలెండర్ లో అక్టోబర్ 4 నుండి 13 వరకు దసరా సెలవులు వుంటాయని వెల్లడించారు. కానీ తెలంగాణలో అక్టోబర్ 3 నుండి సెలవులు ఇవ్వడంతో ఏపీ కంటే రెండు రోజులు ఎక్కువగా సెలవులు వస్తున్నాయి. దీంతో ఏపీలో కూడా ఈ విధంగానే సెలవులు ఇవ్వాలని విద్యార్థుల పేరెంట్స్, టీచర్లు కోరారు.  

Latest Videos

ఇలా ప్రభుత్వానికి, విద్యాశాఖకు చాలామంది టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు దసరా సెలవుల పొడిగింపును కోరారు. ఈ అభ్యర్థనల మేరకు దసరా సెలవులను మరోరోజు పొడిగించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అక్టోబర్ 3 నుండే విద్యాసంస్థలకు సెలవులు ఇస్తున్నట్లు స్వయంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రకటించారు.

అక్టోబర్ 3 నుండి దసరా సెలవులయితే అక్టోబర్ 2 నుండే విద్యాసంస్థలు పనిచేయవు. ఎందుకంటే ఆ రోజున జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. ప్రతి ఏడాది ఈ రోజుల విద్యాంసంస్థలకు ఖచ్చితంగా సెలవు వుంటుంది. కానీ ఈసారి స్పెషల్ ఏమిటంటే దసరా హాలిడేస్ తో ఈ సెలవు కూడా కలిసిరావడంతో విద్యార్థులు ఎగిరి గంతేస్తున్నారు. 

ఇలా అక్టోబర్ 3 నుండి  13 వరకు అంటే 11 రోజులపాటు దసరా సెలవులు... ఇక అక్టోబర్ 2న గాంధీ జయంతి సెలవు. మొత్తంగా వరుసగా 12 రోజులపాటు విద్యార్థులకు సెలవులు వస్తున్నాయి. ప్రభుత్వం ఒక్కరోజు సెలవు పొడిగించడంతో  మరోరోజు కలిసివచ్చింది. లేదంటే కేవలం 10 రోజుల మాత్రమే సెలవులు వచ్చేవి. 

తెలంగాణలో దసరా హాలిడేస్ : 

తెలంగాణ ప్రజలు దసరా పండగను చాలా ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఆడబిడ్డలు సాంప్రదాయబద్దంగా జరుపుకునే బతుకమ్మ సంబరాలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. ఈ పూల పండగ దేశంలో మరెక్కడా కనిపించదు. ఇక దసరా వేడుకలను కూడా అట్టహాసంగా జరుపుకుంటారు. రావణ దహనం, కొత్తబట్టలు ధరించి జమ్మి ఆకులనే బంగారంగా భావించి ఒకరికొకరు పంచుకోవడం... ఇలా చాలా స్పెషల్ గా దసరాను జరుపుకుంటారు. 

ఇలా ప్రతి పట్టణంలో,పల్లెపల్లెనా దసరా సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ఇందుకు తగ్గట్లుగానే ప్రభుత్వం కూడా విద్యాసంస్థలకు సెలవులు ఇస్తుంది. ఇలా ఈ దసరాకి కూడా ఏకంగా 13 రోజుల సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 14 వరకు సెలవులు వుంటాయి. అయితే అక్టోబర్ 2 న గాంధీ జయంతి కాబట్టి ఆ సెలవు కూడా ఈ దసరా సెలవులతో కలిసివస్తుంది. 

అక్టోబర్ 15న తిరిగి విద్యాసంస్థలు పున:ప్రారంభం అవుతాయి. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలన్నింటికి ఈ సెలవులు వర్తిస్తాయి. ఇలా అక్టోబర్ నెలలో సగం రోజులు సెలవులకే పోనున్నాయి. ఈ 15 రోజులు విద్యార్థులు ఫుల్ ఎంజాయ్ చేయనున్నారు... ఇప్పటికే హైదరాబాద్ తో పాటు వివిధ పట్టణాల్లో నివాసముండే విద్యార్థులు సొంతూళ్ళకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

ఇకపై తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో సెలవులే సెలవులు : 

దసరాతో ప్రారంభమయ్యే ఈ సెలవుల సీజన్ సంక్రాంతి వరకు కొనసాగుతుంది. అక్టోబర్ లో దసరాకు దాదాపు 10-15 రోజులు విద్యాసంస్థలుకు సెలవులు. ఇదే నెలలో మళ్లీ దీపావళి పండగ వస్తుంది. అక్టోబర్ 31 దీపావళికి మళ్లీ సెలవు. కొన్ని విద్యాసంస్థలు దీపావళికి రెండ్రోజులు కూడా సెలవు ఇస్తాయి. ఇలా వచ్చే నెలంతా సెలవులకే సరిపోతుంది. 

ఇక నవంబర్ నెలలో పెద్దగా సెలవులేమీ లేవు...కానీ మళ్ళీ డిసెంబర్ లో క్రిస్మస్ సెలవులంటాయి. డిసెంబర్ 25న క్రిస్మస్ పండగ వుంటుంది ... కాబట్టి అప్పుడు కూడా స్కూళ్లకు సెలవులుంటారు. సాధారాణ స్కూళ్లకు ఒకటి రెండ్రోజులే ఇచ్చినా మైనారిటీ స్కూళ్లకు ఎక్కువరోజులు ఇస్తారు. ఆ తర్వాత న్యూ ఇయర్ వేళ మరో సెలవు వుంటుంది. 

ఇక జనవరి 2025 లో మరో పెద్దపండగ సంక్రాంతి వుంటుంది. ఈ పండగను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు. మరీముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో సంక్రాంతి కోలాహలం మామూలుగా వుండదు. కాబట్టి అక్కడ జనవరి 10 నుండి 19 వరకు సెలవులు వుంటాయి. తెలంగాణలోనూ నాలుగైదు రోజులు సంక్రాంతి సెలవులుంటాయి. ఇలా దసరా నుండి సంక్రాంతి వరకు విద్యాసంస్థలకు సెలవులే సెలవులు. 

తెలంగాణ, ఏపీ కంటే కర్ణాటకలోనే దసరా సెలవులు అత్యధికం : 

దసరా పండక్కి తెలంగాణలో 13, ఆంధ్ర ప్రదేశ్ లో 12 రోజుల సెలవులు ప్రకటించారు. కానీ ఇంతకంటే ఎక్కువ సెలవులను కర్ణాటక విద్యాసంస్థలకు ప్రకటించారు. కర్ణాటక విద్యార్థులకు అక్టోబర్ 3 నుండడి 20 వరకు దసరా సెలవులు ఇచ్చారు. ఇక్కడ కూడా అక్టోబర్ 2 గాంధీ జయంతి సెలవు దసరా సెలవులతో కలిసి వస్తుంది. 

దసరా పండగను కన్నడ ప్రజలు కూడా ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా మైసూరులో రాజవంశం ఆధ్వర్యంలో ఈ వేడుకలు అట్టహాసంగా జరుగుతాయి. ఈ దసరా సంబరాలను చూసేందుకు దేశ విదేశాల నుండి సందర్శకులు మైసూరుకు వెళుతుంటారు. 

ఇలా దక్షిణాది రాష్ట్రాల్లో దసరా పండగ ఘనంగా జరుపుకుంటారు. కాబట్టి విద్యాసంస్థలకు కూడా అత్యధికంగా సెలవులు ఇస్తుంటారు. ఇలా ఈసారి కూడా అక్టోబర్ లో మూడు రాష్ట్రాల్లో 10 నుండి 20 రోజుల సెలవులు వచ్చాయి. 

 

click me!