వైసీపీలో చేరిన డొక్కా, మరో మాజీ ఎమ్మెల్యే: ఒక్కరోజే టీడీపీకి రెండు షాకులు

By Siva KodatiFirst Published Mar 9, 2020, 5:03 PM IST
Highlights

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌తో పాటు మరో మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రహమాన్ వైసీసీ తీర్థం పుచ్చుకున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌తో పాటు మరో మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రహమాన్ వైసీసీ తీర్థం పుచ్చుకున్నారు.

విశాఖ టీడీపీ అర్బన్ అధ్యక్షుడిగా వ్యవహరించిన రెహమాన్ గతేడాది డిసెంబర్‌లో ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరిద్దరూ సోమవారం వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. 

అనంతరం రెహమాన్ మాట్లాడుతూ.. వైసీపీలో చేరడం సంతోషంగా ఉందని, జగన్ తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలను స్వాగతిస్తున్నానని ఆయన అన్నారు. 

Also Read:చంద్రబాబుకు షాక్: టీడీపీకి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా

విశాఖ ఎగ్జిక్యూటివ్ కాపిటల్‌గా ప్రకటించిన రోజే ముఖ్యమంత్రి నిర్ణయానికి మద్ధతు తెలిపానని రెహమాన్ గుర్తుచేశారు. మద్యపాన నిషేధం కోసం తన భార్య పోరాటం చేశారని.. ప్రస్తుతం రాష్ట్రంలో అమలు చేస్తున్న మద్య విధానం వల్ల ఎంతో మేలు చేస్తోందన్నారు.

పదవుల కోసం తాను పార్టీలో చేరలేదని మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులను విజయం సాధిస్తారని రెహమాన్ ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్‌లో టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత రెహమాన్ మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు కుమారుడి వల్లే తాము బాబుకు దూరమయ్యామన్నారు.

Also Read:బాబుకు షాక్: వైసీపీలోకి మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి?

ఎన్ఆర్‌సీ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు జగన్ ప్రకటించారని ఇది తమకు సంతోషాన్ని కలిగించిందని రెహమాన్ చెప్పారు. ఏపీలో ఎన్ఆర్‌సీ అమలు చేయడం లేదని ప్రకటించిన ముఖ్యమంత్రికి మైనార్టీలంతా రణపడి ఉన్నారన్ని ఆయన చెప్పారు. విశాఖలో రాజధాని ఏర్పాటుపై కులాల ప్రస్తావన తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. అందుకే చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నానని తెలిపారు.

ఇప్పటి వరకు చంద్రబాబు ఎన్ఆర్‌సీని వ్యతిరేకించనందుకు టీడీపీ విశాఖ అర్బన్ అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రోజే మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ సైతం తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. 

click me!