పింఛన్లు ఆపించింది చంద్రబాబే .. వాలంటీర్లు ఆ మాటలు నమ్ముతారా : పేర్ని నాని ఘాటు విమర్శలు

By Siva KodatiFirst Published Apr 1, 2024, 7:05 PM IST
Highlights

వాలంటీర్ల సేవల నిలిపివేతకు కుట్ర చేసింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపించారు వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని. పెన్షన్లు ఇవ్వకుండా ఆపటం చంద్రబాబు వల్ల కాదని .. గతంలో ఇంటింటికి పింఛను కార్యక్రమాన్ని ఆయన చేపట్టారా అని నాని నిలదీశారు. నిమ్మగడ్డకు ఎవరెవరితో సంబంధాలున్నాయో అందరికీ తెలుసునని పేర్నినాని దుయ్యబట్టారు.

చంద్రబాబు కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు మాజీ మంత్రి , వైసీపీ నేత పేర్ని నాని. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 14 ఏళ్లలో పేదల కోసం చంద్రబాబు ఒక్క పథకం కోసం పెట్టలేదన్నారు. చంద్రబాబు పేదలను ఓటు బ్యాంక్‌గానే చూశారని .. నిమ్మగడ్డకు ఎవరెవరితో సంబంధాలున్నాయో అందరికీ తెలుసునని పేర్నినాని దుయ్యబట్టారు. చంద్రబాబు చరిత్ర అందరికీ తెలుసునని.. వాలంటీర్ల సేవల నిలిపివేతకు కుట్ర చేసింది బాబేనని ఆయన ఆరోపించారు. నిమ్మగడ్డ ఎవరో ప్రజలకు తెలియదా అని పేర్ని నాని ప్రశ్నించారు. పెన్షన్లు ఇవ్వకుండా ఆపటం చంద్రబాబు వల్ల కాదని .. గతంలో ఇంటింటికి పింఛను కార్యక్రమాన్ని ఆయన చేపట్టారా అని నాని నిలదీశారు. 

వాలంటీర్ల వ్యవస్థపై ఖరీదైన లాయర్‌ను పెట్టి సుప్రీంకోర్టుకెక్కింది నువ్వు కాదా అని పేర్ని నాని దుయ్యబట్టారు. వాలంటీర్ల నడుం విరగ్గొడతానని పవన్ అనలేదా, రాష్ట్రంలో ఆడపిల్లల అదృశ్యానికి కారణం వాలంటీర్లేనంటూ ఆరోపణలు చేసింది పవన్ కళ్యాణ్ కాదా అని నిలదీశారు. జగన్ పేదలకు ఎన్నడూ అన్యాయం చేయలేదని.. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాని, రూ.50 వేలు  సంపాదించేలా చేస్తానని చంద్రబాబు చెబితే వాళ్లు నమ్ముతారా అని పేర్ని నాని దుయ్యబట్టారు.   

కాగా.. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీలో వాలంటీర్ల విధులపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. పింఛన్లు సహా నగదు పంపిణీని వాలంటీర్లతో చేయించొద్దని ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయరని .. లబ్ధిదారులు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి నగదు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. 
 

click me!