ఏపీలో పింఛన్ కష్టాలు.. పొట్టకొట్టారంటూ జగన్‌పై చంద్రబాబు ఆగ్రహం

By Siva KodatiFirst Published Apr 1, 2024, 5:03 PM IST
Highlights

రాజకీయ స్వార్ధం కోసం సీఎం జగన్.. పింఛనర్ల పొట్టకొట్టారని.. జనసేన బీజేపీ టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే రూ.4 వేల పింఛన్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ నేతలు కలెక్టర్లను కలిసి పింఛన్ సొమ్ము అందేలా చొరవ చూపాలని చంద్రబాబు ఆదేశించారు. కూటమి వచ్చాక కూడా వాలంటీర్ల వ్యవస్థను ప్రకటిస్తామని చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మండిపడ్డారు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో పింఛనర్లకు నగదు ఇవ్వకపోవడంపై ఆయన స్పందించారు. రాజకీయ స్వార్ధం కోసం సీఎం జగన్.. పింఛనర్ల పొట్టకొట్టారని.. జనసేన బీజేపీ టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే రూ.4 వేల పింఛన్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ రెండు పింఛన్ అందనివారికి.. తమ ప్రభుత్వం రాగానే కలిపి చెల్లిస్తామని ఆయన పేర్కొన్నారు. 

గద్దె దిగుతూ కూడా జగన్ పైశాచికంగా వ్యవహరిస్తున్నారని.. టీడీపీ నేతలు కలెక్టర్లను కలిసి పింఛన్ సొమ్ము అందేలా చొరవ చూపాలని చంద్రబాబు ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ జగన్ రూ.13 వేల కోట్లను కాంట్రాక్టర్లకు చెల్లించారని.. ఎవరెవరికి ఎన్ని బిల్లులు ఇచ్చారో ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమి వచ్చాక కూడా వాలంటీర్ల వ్యవస్థను ప్రకటిస్తామని చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. వాలంటీర్లకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ ఇచ్చి మంచి జీతం వచ్చేలా చేస్తామని ఆయన వెల్లడించారు. 

కాగా.. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీలో వాలంటీర్ల విధులపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. పింఛన్లు సహా నగదు పంపిణీని వాలంటీర్లతో చేయించొద్దని ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయరని .. లబ్ధిదారులు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి నగదు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. 
 

click me!