
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు విడ్డూరంగా ఉన్నాయని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శించారు. జనసేన రాజకీయ పార్టీనేనా అని ప్రశ్నించారు. మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన 10వ ఆవిర్బావ సభలో పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్పై పేర్ని నాని స్పందించారు. ఈ రోజు ఉదయం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. విపక్ష పార్టీలు విడివిడిగా కాదని అందరూ కలిసే రండి అని అన్నారు. అందరూ కలిసి రమ్మనే తాము కోరుకుంటున్నామని.. అలా వస్తే 2024 ఎన్నికల్లో ఎవరేంటో తెలుస్తుంది కదా అని అన్నారు.
2014-2019 వరకు జరిపిన పాలనను చూపించి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఓట్లు అడగగలరా? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ఇప్పుడు ముసుగు తీసేశారని అన్నారు. పవన్ పదే పదే.. కులం, కాపులు, ఓట్లు అని మాట్లాడుతున్నారని.. అందరిని తీసుకెళ్లి చంద్రబాబుకు అప్పజెబుతానని అంటున్నాడని విమర్శించారు. పవన్ తమను తిడితే.. తాము ఆయనను తిడతామని అన్నారు.
చిరంజీవిని కూడా పరోక్షంగా పవన్ కించపరుస్తున్నారని పేర్ని నాని విమర్శించారు. ‘‘పవన్ కల్యాణ్కు సినీ జీవితాన్ని, పది మందిలో గుర్తింపును ఇచ్చిన చిరంజీవిని ఉద్దేశించి కూడా ఆయన కించపరుస్తూ మాట్లాడుతున్నాడు. కొంతమంది పార్టీ పెట్టారు.. మూసేశారు.. తాను మాత్రం అలా కాదని అంటాడు. మన రాష్ట్రంలో పార్టీ పెట్టి మూసేసింది ఎవరు?. 10 ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చానని పవన్ అంటున్నాడని.. మరి యువరాజ్యం అధ్యక్షుడు ఎవరు?. తనకు ముందు ఇంట్లో రాజకీయ నాయకుడు లేడని అంటాడు.. మరి 2014లో జనసేన పార్టీ పెట్టేప్పటికీ పవన్ కల్యాణ్ సొంత అన్న చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నారు కదా. చిరంజీవిని పరోక్షంగా పార్టీ మూసేశారని కామెంట్ చేశారని.. ఆ పార్టీ మూసేయడానికి మీరంతా కారకులు కాదా?. ఒడిపోయిన తర్వాత చిరంజీవిని ఒంటరిగా ఒదిలేసింది ఈ మహానుభావుడు కాదా?’’ అని ప్రశ్నించారు.
జగన్ ప్రజల కోసం ఏం చేయడానికైనా సిద్దంగా ఉంటాడని.. అది నాయకత్వ లక్షణమని అన్నారు. అటువంటి వ్యక్తి కింద పనిచేస్తున్నందుకు తాము కూడ గర్వపడుతుంటామని చెప్పారు. కాపు కులస్తులను పోగేసి చంద్రబాబుకు అప్పజెప్పేందుకు.. కమ్మ ఆయనకు పవన్ కల్యాణ్ ఊడిగం చేస్తున్నారని తాను కూడా అనగలనని.. అయితే అది నిజమైనప్పటికీ తాను అలా అననని అన్నారు.