
సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మన్నెం నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పేరును “వైయస్సార్ ప్రదేశ్” గా మార్చమని సీఎం జగన్ను కోరారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. తెలుగును ఓ తెగులుగా భావించి దానిని పీకిపారవేస్తున్నాం కాబట్టి.. రాష్ట్రానికి 'YSR LAND' అనే ఇంగ్లీష్ పేరు పెడితే భేషుగ్గా ఉంటుందని నాగేశ్వరరావు ట్వీట్ చేశారు. అయితే ఆయన ట్వీట్ను సపోర్టు చేస్తూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘‘ప్రజలు జిల్లాల పేర్ల గురించి కొట్టుకోకుండా అన్ని జిల్లాల పేర్లు వైఎస్సార్ కృష్ణా, వైఎస్సార్ గుంటూరు, వైఎస్సార్ గోదావరి… అని పెట్టెస్తే ఒక పని అయిపోతుంది’’ అని ఓ నెటిజన్ పేర్కొన్నారు.
ఇక, ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా పేరు మార్పు అగ్గిరాజేసిన సంగతి తెలిసిందే. కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చొద్దంటూ జిల్లా కేంద్రం అమలాపురంలో మంగళవారం చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ క్రమంలో ప్రస్తుతం కోనసీమలో పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రిటైర్డ్ ఐపీసీ నాగేశ్వరరావు ఈ రకమైన ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.