నిమ్మగడ్డ రమేష్ కుమారైనా తప్పించుకోలేరు: విజయసాయి రెడ్డి

By telugu teamFirst Published Mar 21, 2020, 1:57 PM IST
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈసీ రమేష్ కుమార్ పేరు మీద రాసిన లేఖను ఎవరు రాసినా, కేంద్ర హోంశాఖకు ఎవరు పంపినా చిక్కులు ఎదుర్కోక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు.

అమరావతి: కేంద్ర హోం శాఖకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసినట్లు చెబుతున్న లేఖను ఎవరు సృష్టించినా, పంపినా క్రిమినల్ కేసులు ఎదుర్కోక తప్పదని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అన్నారు. ఆ లేఖలో ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే ఆరోపణలు, ఆర్డినెన్స్ ను తప్పు పట్టే వ్యాఖ్యలు ఉన్నాయని ఆనయ అన్నారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు అయినా, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అయినా తప్పించుకోలేరని ఆయన ట్విట్టర్ వేదికగా అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఆశ చూపిన డబ్బు తీసుకోవడానికి ఓటర్లు తిరస్కరించారని ఆయన అన్నారు. 

చంద్రబాబు భయపడింది అక్కడేనని విజయసాయి రెడ్డి అన్నారు. డబ్బు, మందు లేకుండా ఎన్నికలు జరిగితే జిల్లాలవారీగా సింగిల్ డిజిట్ కే పరిమితమవుతామనే ఆందోళనతో చంద్రబాబు డ్రామాలు ప్రారంభించాడని ఆయన అన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో డ్రామాలు ఆడించి ఎన్నికలను వాయిదా వేయించారని ఆయన అన్నారు. 

తన మనుగడ కోసం చంద్రబాబు కులం, ప్రాంతం కార్డులను వాడుతాడని ఆయన అన్నారు. చంద్రబాబును నమ్మి చెప్పినట్లు చేసినవారు తర్వాత సస్పెన్షన్లు, కేసులు ఎదుర్కోవడం చూస్తున్నట్లు ఆయన తెలిపారు. అయినా సూసైడ్ స్క్వాడ్ సభ్యులు కులదైవం కోసం ఆరాటపడుతూనే ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. వీళ్ల ఆటలు కొద్ది రోజులు సాగినా చివరకు చట్టాల ముందు తల వంచాల్సిందేనని ఆయన అన్నారు.

click me!